సీతానవమి ప్రత్యేకం
మనకు చైత్రశుద్ధనవమి సుపరిచితమే. ఆరోజు శ్రీరామనవమి. సరిగ్గానెలరోజుల తర్వాత అంటే వైశాఖశుద్ధనవమి నాడు సీతానవమి. ఆ రోజు సీతమ్మ జనకునికి దొరికినరోజు. దీనినే జానకినవమి, జానకిజయంతి,సీతాజయంతిపేర్లతో ఘనంగాపండుగ జరుపుకుంటారు. సాధారణంగా మన పండుగ లన్నీ, ఉగాది,సంక్రాంతి వంటి ప్రకృతిపరమైన విశేషాలతోనో, దసరా,దీపావళి వంటి మానవాళికి మేలు జరిగిన సందర్భంగా చేసుకునేవో ఉంటాయి. ఆమె మిథిలరాజ్యంలో జన్మించింది. భారతీయ స్త్రీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించింది తమ ఆడపడుచు అన్న అభిమానంతో మిథిలప్రాంతవాసులు కుటుంబ పండుగగా చేసుకోవడం ఈసీతానవమి విశిష్టత. అంటే మనఇంట్లో పిల్లల పుట్టినరోజుని ఎలాచేసు కుంటామో అలావాళ్ళ స్వంతఇంటి ఆడబిడ్డ పుట్టినరోజుని చేసుకుంటున్నంత సంబరంగా జరుపు కుంటారు. అందుకే జానకి,వైదేహి,మైథిలి అనే పేర్లతోకూడా ఆమె ప్రసిద్ధమైంది.
స్త్రీతత్వానికి చిరునామా:
సంపూర్ణ స్త్రీతత్వానికి సీతాదేవి నిదర్శనం. ఆమె వ్యక్తిత్వం బహుముఖమైనది, శక్తివంత మైనది మరియు స్వతంత్రమైనది. రాముడికిముందు సీత, రాముడితో సీత మరియు రాముడుకి దూరమైన సీత అని మూడుభాగాలుగా ఆమె వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే, భారతదేశ నారీశక్తి ఆత్మకు అది ఆవిష్కరణ అని మనకు బోధపడుతుంది. సౌకర్యం కంటే విధిని, సౌలభ్యం కంటే గౌరవాన్ని మరియు ప్రాపంచికశక్తి కంటే ఆధ్యాత్మిక బలాన్ని ఆమె ఎంచుకుంది. అంతర్గతంగా చాలా బలమైన ఆత్మగౌరవ నడవడిక మనకు అడుగడుగునా కనిపిస్తుంది. బిడ్డగా,భార్యగా,కోడలిగా,రాణిగా,తల్లిగా ఆమెనడి చినతీరు అనుసరణీయం. నిశితంగా గమనిస్తేనే కానీ సీత మహోన్నత వ్యక్తిత్వం మనకు అర్ధం కాదు.
సర్వసాధారణంగా పురుషుడు చపలచిత్తుడు. చంచలస్వభావం కలవాడు.ఇక బలాఢ్యుడైన పురు షునిసంగతి చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆజానుబాహుడు, స్ఫురద్రూపి, అజేయుడైన శ్రీరాముణ్ణి తన ప్రేమానురాగాలతో, అంతులేని వాత్సల్యంతో, ముప్పిరిగొన్న అమాయకత్వంతో, మూర్తీభవించిన ముగ్ధమోహనరూపంతో, తనదగ్గర చిన్నపిల్లవాడిగా మార్చుకుంది సీతాదేవి. కాబట్టే, తల్లికి దూరమైన బిడ్డ ఎంతగా తల్లడిల్లిపోతాడో, అంతగా ఆమె ఎడబాటు సమయంలో వేదనకుగురై రోదించాడు రాముడు. ఆమెకోసం స్వయంగా నలుదిశలావెదికాడు. ఆమెజాడకోసం తన వానరస్నేహితుల సాయం తీసుకున్నాడు. ఆమెను కనుగొన్నాక, తిరిగి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ, ఆయనలో నిబిడీకృతమైవున్న అద్భుత నైపుణ్యాలను, నేర్పరితనాన్ని బహిర్గత పరిచాయి. నిఖిల లోకంలో ఏకపత్నీవ్రతుడంటే శ్రీరాముడే అన్న కీర్తియశస్సులను ఆచంద్రతారార్కం ఆయనకు దక్కేట్లు చేసింది. సీతాపతిగా మార్చుకుంది. అలా ఆమెలోని స్త్రీత్వం, రామునిలో సహజంగాఉన్న మర్యాద పురుషోత్తముణ్ణి ప్రపంచంముందు ప్రదర్శింపచేసింది. ప్రకృతీపురుషులలాగా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అవగాహన, అనురాగాలకు చక్కని ప్రతీక సీతాదంపతులు. అలా స్త్రీజన్మకు పరిపూర్ణ త్వాన్ని నింపింది సీతమ్మ వ్యక్తిత్వం.
అన్యోన్య దాంపత్యం:
సాధారణంగా తన భర్తకు దక్కాల్సిన రాజ్యాధికారం దక్కకపోగా, అరణ్యవాసానికి వెళ్లాల్సివస్తే, ఎవరైనా ఒక్కసారిగా కృంగిపోతారు. ఆబాధ వర్ణనాతీతం. అంతకష్టం ఎవరికీరాకూడదనే కోరుకుం టాం. అలాంటిది ఆమె వాటికి ఏమాత్రం విలువివ్వకుండా భర్తతోటిదే తనలోకం అని నిర్ణయించు కుంది. భర్తదగ్గర ఉండటమే అసలైన అంతఃపురవాసమని, అదే తన అయోధ్య అని ఆమె నిశ్చితాభి ప్రాయం. కాబట్టే రాణివాసం వదిలి భర్తతో వనవాసానికేగింది. రాముడు ఎంత వారించినా, అనున యించినా, ఆయనతో ఒకింత గొడవపడి, ఒప్పించుకుని, స్వచ్చందంగా రాజభోగాలు త్యజించి, 14 ఏళ్ళు దుర్గమారణ్యంలో భర్తతో కలిసి గడపడానికి వెళ్ళడం, అక్కడున్నంతకాలం రామునితో ప్రేమానురాగాలు పంచుకోవడమే మనకు కనిపిస్తుంది కానీ, ఎప్పుడెప్పుడు అరణ్యవాసం పూర్తవు తుందా అన్న ఎదురుచూపులతోనో అసంతృప్తితోనో ఆమెగడపలేదు. తమ అపురూప దాంపత్య జీవితానికి రావణుడిరూపంలో ఎదురైన ప్రతిబంధకాన్ని కూడా ఆమె ప్రశాంతచిత్తంతో స్వీకరించింది. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి స్వరూపం.
క్షీరసాగర మధనంలో కూర్మరూపం ధరించి మందరపర్వతం మునిగి పోకుండా శ్రీమహావిష్ణువు ఎలా తన భుజస్కంధాలపై వేసుకున్నాడో, సంసార సాగరమధనంలో వచ్చే అన్నిరకాల ఆటుపోట్లను సీతాదేవి నేర్పుగా, చక్కటి సమయస్ఫూర్తితో, సమన్వయంతో నిర్వహించి నిదర్శనగా నిలిచింది. అందుకే మనజ్ఞాపకాల్లో వారిద్దరి ఎడబాటే గుర్తున్నా దంపతులనగానే వారే గుర్తొస్తారు. అంతలా మనసంస్కృతిలో సీతారాముల ధర్మజీవనం కలగలిసిపోయింది. అలా అర్ధనారీ శ్వరుని ధనుర్బంగం ద్వారా ఒక్కటైన సీతారాములు, భూమ్మీద త్రికరణశుద్ధిగా ఒక్కటై జీవించారు. వారి దాంపత్యం అనుసరణీయం. కుటుంబవ్యవస్థకు వెన్నెముక వారి అన్యోన్యత.
స్థితప్రజ్ఞతకు చిహ్నం:
మన స్త్రీదేవతలంతా ఆయుధాలుధరించే మనకు దర్శనమిస్తారు! సత్యభామ కూడా యుద్ధం చేసింది. అయితే ఏ ఆయుధమూ ధరించకుండానే, ప్రేమపాశంతో దుష్టసంహారం చేసిన శక్తిస్వరూపిణి సీతమ్మ. ఆమెపై రామునికున్న అచంచలవిశ్వాసం,అవ్యాజప్రేమ, తనకోసమే వనవాసానికొచ్చిందన్న అభిమానాలు రాముణ్ణి ఆమెకు కట్టిపడేశాయి. ఎటువంటి సందర్భంలోనైనా ఆమె నిరాశపడలేదు. సంయమనం కోల్పోలేదు. స్థితప్రజ్ఞత కట్టుతప్పలేదు. ఆమెను నిస్పృహ ఆవరించలేదు. ఆమె నిశ్చల తత్వానికి భంగం కలగలేదు. తనబాధలకు కారణమైనవారిని పరుషపదజాలంతో దూషించలేదు. అలా అని వాటన్నింటినీ పళ్ళబిగువున ఆమెభరించలేదు. ఆమె కుంగుబాటుకు లోనైన దాఖలాలు లేవు. భర్త ఎడబాటుకూడా తాత్కాలికమే అన్న పరిపూర్ణవిశ్వాసంతో ఆమె ప్రతిక్షణం గడిపింది. అందుకే ఆమె చుట్టూచేరి బాధపెడుతున్న ఆడ రాక్షసమూకను చంపేస్తానని హనుమంతుడు అంటే, దానికి జవాబుగా వేధించడం రాక్షస ప్రవృత్తి. క్షమించడం మన సహజగుణం. దానిని కోల్పోకూడదు అని హితవు చెప్పివారిస్తుంది. సూటిగాచెప్పాలంటే, ప్రకృతి తన స్పందన ఎలా తెలియచేస్తుందో, సీతమ్మ కూడా అలానే మౌనంగా స్పందించింది. ఎక్కడా ఎవరితోనూ సంవాదం జరిపినట్టుగానూ, ధిక్కరించినట్లుగానూ, తన వాక్చాతుర్యంతో ఒప్పించినట్లో మెప్పించినట్లో కనపడదు. ఏ రాముని కోసమైతే అంతఃపురము విడిచి అడవులకొచ్చిందో, ఆ రామునికి తనను దూరంచేసి బంధించిన రావణుణ్ణి, భర్తచేతే సంహరింపచేసింది. అప్పటిదాకా ఆమె చాలానిబ్బరంగా కాలంగడిపింది. ప్రశాంత జీవనానికి విజ్ఞత ఎంతటి కీలకమో సీతాదేవి ఆచరించి మనకు బోధించింది. మూర్తీభవించిన ధర్మ స్వరూపం శ్రీరాముడైతే, ఘనీభవించిన స్థితప్రజ్ఞ స్వరూపం సీతాదేవి.
సీత జన్మస్థలి :
హిమాలయాలను ఆనుకుని, తూర్పున కోసీనదిని, దక్షిణాన గంగానదిని పశ్చిమాన గండకీనదిని హద్దులుగాగల మిథిలరాజ్యాన్ని త్రేతాయుగంలో వైదేహివంశం పాలించింది. ఆ వంశపురాజులంతా జనక అనే నామాన్ని ధరించి ఉంటారు అందుకే వారిరాజధాని పేరు జనక్ పూర్ అనివచ్చింది. ఇది ఒకప్పుడు మనదేశ భూభాగంలో ఉండేది, ప్రస్తుతం నేపాల్ దేశంలోని మాదేష్ ప్రావిన్స్ కు రాజధాని. ధనుషజిల్లాలో ఉంది. జనకుని అసలుపేరు సీరధ్వజుడు. ఆయనపాలనలో ఒకసారి ఆరాజ్యంలో తీవ్రమైనకరవు తాండవించింది. దానినుండి రాజ్యాన్ని కాపాడుకోవడానికి జనకుడు యాగం చేయ సంకల్పించి భూమిని దున్నుతుండగా సీతాదేవి దొరికింది. సంబరంతో ఆమెను తనభార్య సుమేధ (సునయన)కు అప్పగించి పెంచుకుంటారు. కొద్ది రోజుల్లోనే వరుణుడు కరుణించడంతో మంచి వర్షాలుకురిసి రాజ్యం సస్యశ్యామలమైంది. ఆతర్వాత రామునితో సీతకళ్యాణం జరగడం మనకు తెలిసిందే. కలియుగ ప్రారంభంలో వైదేహిరాజ్యం అంతరించిపోయింది. ఆప్రాంతమంతా అరణ్యంగా మారిపోయింది. చతుర్భుజ్ గిరి, సుర్ కిషోర్ అనే రామభక్తు లిద్దరు రామాయణంలోని కీలకఘట్టాలు జరిగిన ప్రాంతాలను గుర్తించేక్రమంలో సీతమ్మ జన్మస్థలికోసం వెదకడం ప్రారంభించారు. ఉత్తర మిథిల వైపు వెళ్లి గిరి వెదకడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ఒకపెద్ద వృద్ధ మఱ్ఱిచెట్టు క్రింద ఒకరోజు ఆయన నిద్రపోతుండగా రాముడు కలలో కనిపించి, నువ్వు ఇప్పుడు నిద్రపోతున్న చోటే, ఒకప్పటి పురాతననగరం జనకపురి అని, అదే సీతాదేవి జన్మించిన ప్రాంతమని, అది తిరిగి వెలుగులోకి వచ్చే సమయం ఆసన్నమైందని, ఆ చెట్టుక్రిందనే తమ విగ్రహాలున్నాయని, వాటిని వెలికితీసి, పూజలు ప్రారంభించమని చెప్పాడు.
నిత్యధూపదీప నైవేద్యాలు చెల్లించలేని నిస్సహాయుడినని, నీకు ఏదైనా లోటుసంభవిస్తే నేను తట్టుకోలేనని విన్నవించుకున్న గిరితో… నువ్వు ఏది సమర్పించినా నాకు సంతృప్తేనని, అయినా కొద్దికాలంలోనే అన్నీ సమకూరుతాయని కర్తవ్యబోధ చేసాడు.
మరోవైపు సీతమ్మ విగ్రహాన్నిచేతబూని ఊరూరాతిరుగుతూ ఆమె జన్మస్థలికోసం మిథిలదక్షిణభాగంలో తిరుగు తున్న కిషోర్ కు కూడా అమ్మవారు కలలో కనిపించి, హిమాలయాలు,గంగ,కోసి,గండకీ నదుల మధ్య ఉన్న ప్రాంతానికి వెళ్ళమని, అది తన జన్మస్థలమని చెప్పి అక్కడ పూజలు జరపమని చెప్పడంతో అతనూ జనకపురికివెళ్లి గిరిని కలుసుకుని సీతారాములకు అర్చనలు చేయడం మొదలుపెట్టారు. క్రమంగా ఆ ప్రాంతమంతా తిరిగి మనుష్యసంచారంతో కళకళలాడటం మొదలైంది. అయితే ఇదే మిథిలారాజ్యంలో జనక్ పుర్ కి 50కిమీ దూరంలో ఉన్న సీతాకుండ్ అనేప్రాంతాన్ని కూడా సీతమ్మ జన్మస్థలి అనేందుకు ఆధారాలున్నాయి. ప్రస్తుత బీహార్ లోని సీతామర్హి జిల్లాలోఉందీ సీతాకుండ్. అయోధ్య రామమందిరంలానే భారీగా ఇక్కడ సీతమ్మతల్లి ఆలయాన్ని నిర్మిస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సీత వ్రతం:
పవిత్రత, ప్రకృతితత్వం మూర్తీభవించినది సీతాదేవి. వాటిని గుర్తుచేసుకుంటూ ఆమె అనుగ్రహాన్ని పొందడానికై సీతానవమి రోజున వ్రతమాచరిస్తారు. ఉదయాన్నే తలారా స్నానం చేసి, గుడికివెళ్ళి సీతమ్మకు అర్చనలుచేసి, సాయంత్రంవరకు ఉపవాసముండి రాత్రికి సీతమ్మకు పూజలు చేసి, రామాయణంలోని సుందరకాండ పారాయణ చేసుకుని, నైవేద్యాలు చెల్లించుకుని, ముత్తైదువులకు వాయినాలు చెల్లించి, అన్నదానం, వస్త్రదానం చేసి ప్రసాదం తీసుకుంటారు.
-వలివేటి అమరేంద్ర