పంచభూతాలలో ఒకటైన నీటిని ఆరాధిస్తూ నదులను తల్లులగా పూజించే సంస్కృతి మన హిందూ సంస్కృతి. అందులో భాగంగానే ఏటా ఒక నదికి చొప్పన పుష్కరాలు వస్తుంటాయి. గురువు ఏడాదికి ఒకరాశి చొప్పున పన్నెండు రాశుల్లో సంచరిస్తూ ఉంటాడు. గురువు ఆయా రాశుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు వస్తుంటాయి. తొలి పన్నెండు రోజులను ఆది పుష్కరాలనీ, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలనీ పిలుస్తారు. అందులో భాగంగా గురువు మిథునరాశిలో ప్రవేశిస్తే సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి.
సరస్వతీ నది నిజంగానే ఉందా?
పురాణేతిహాసాల్లో ప్రస్తావించిన సరస్వతీనది భూమిపై ప్రవహించేదని రుగ్వేద కాలంలోనూ ఈ నది ఉనికి ఉందని చరిత్ర చబుతోంది. అయితే ఇప్పటికీ ఈ సరస్వతీ నది భూమిపై ఉండేదా లేదా అన్న తర్జనభర్జనలు పెద్ద ఎత్తునసాగాయి. ఈ క్రమంలో ఈ నది ఉనికి వాస్తవమేనా కాదా? అన్న విషయంపై పరిశోధనలు జరిపారు. ఫ్రాన్స్కు చెందిన చరిత్రకారుడు మిచెల్డ్ డానిడో రాసిన "ది లాస్ట్ రివర్" అనే పుస్తకంలో సింధూనాగరికత కాలంలో జీవనాడిగా సరస్వతీనది ఉండేదని, కొంతకాలం తర్వాత ఈ నది ప్రవహించే దిశ మారిపోయిందని రాశారు. యమునానదిని తాకుతూ చివరికి గంగానదిలో కలిసిపోయిందని కూడా అందులో పేర్కొన్నారు. మన భారతీయ పరిశోధకులు అయిన శ్రీ విష్ణుశ్రీదర్ వాకణ్కర్ హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్లలో పరిశోధన చేసి సరస్వతి నది అంతర్వాహినిగా ఉందని తేల్చారు. ఇది ఇతర నదుల కంటే చాలా పురాతన చరిత్ర కలిగిన నది అని, సింధు లోయ నాగరికతకు ‘సరస్వతీ నాగరికత’ అని పేరు మార్చాలని ఆయన సూచించారు.
భారత ప్రభుత్వం 2016లో వేసిన ఓ కమిటీ కూడా ఒకప్పుడు సరస్వతి నది ఉండేదని తేల్చి చెప్పింది. 2018లో ఇస్రో తీసిన ఉపగ్రహ చిత్రాలు సరస్వతీ నది ఉనికిని నిర్దారించాయి పార్లమెంట్కు ఇస్రో సమర్పించిన పత్రాలలో సరస్వతీనది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించేది శాటిలైట్ ఫోటోల ద్వారా ఇస్రో నిర్దారించింది. కాలక్రమేణా జరిగిన భౌగోళిక మార్పులు, వాతావరణ మార్పులతో సరస్వతీ నది,దాని ఉపనది అయిన దృషద్వతి నది కనిపించకుండా పోయాయని స్పష్టం చేసింది. అయితే ఉత్తరప్రదేశ్లోని మానా, బదరీనాథ్ సమీపంలోని అలకనంద నదితో కలిసి అంతర్వాహినిగా సరస్వతినది ప్రవహించినట్లుగా గుర్తించారు.
కనిపించని నదికి పుష్కరాలు ఎందుకు?
చాలామంది అసలు ఈ సరస్వతీ నది కనిపించదు కదా... కనిపించని నదికి పుష్కరాలు నిర్వహించడం ఏంటీ... ఇందులో నీరు ఉండదు కదా? అనే వాదనలు వినిపిస్తున్నారు. అయితే పూర్వకాలం నుంచి నదులకు పుష్కరాలు నిర్వహించుకుంటున్నాం. అందులో సరస్వతీ నది కూడా ఒకటి. ఈ నది భౌగోళికంగా వచ్చిన మార్పుల వల్ల అంతర్థానం అయినప్పటికీ పుష్కరాలు నిర్వహించడం మాత్రం మానలేదు. ఇంతకాలం సరస్వతీ నదికి పుష్కరాలు నిర్వహించడం ఆ నది సమీప ప్రాంతాల్లోనే జరిగేది. అంటే త్రివేణి సంగమ ప్రాంతమైన ప్రయాగరాజ్లో, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో, గుజరాత్లోని సోమనాథ్లో రాజస్థాన్లోని పుష్కర్లో నిర్వహించేవారు. ఇప్పుడు తెలంగాణలోని కాళేశ్వరంలో కూడా ఈ నదికి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం సరస్వతీ పుష్కరాలు 2025 పేరిట ప్రత్యేక యాప్, వెబ్ పోర్టల్ను కూడా రూపొందించింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు అంటే కాళేశ్వర, ముక్తీశ్వర లింగాలుగా వెలిసిన క్షేత్రం కాళేశ్వరం ఒకటే. ఈ రెండు లింగాలకు నిత్యం అభిషేకించిన నీరు గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానంలో కలుస్తుండడంతో పాటుగా ఇక్కట సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఉత్తరాదిలో నాలుగు ప్రాంతాలుండగా దక్షిణాదిలో కాళేశ్వరం ఒకటే సరస్వతీనది ప్రవహించే ప్రాంతం.ఈ నదిని పవిత్రమైన సంగమ ప్రాంతంగా భావిస్తారు. అందుకే ఈ క్షేత్రంలో మే నెల 15 నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కరాలకు ఏర్పాట్లు జరిగాయి.