అసలు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఎవరు? కాలజ్ఞానం అంటే ఏమిటి? శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఏం చెప్పారు,? అవి ఎంతవరకూ నిజం అయ్యాయి అనే అంశాలు ఒక్కొక్కటీ తెలుసుకుందాం కాలజ్ఞానం అంటే భవిష్యద్దర్శనం అన్నమాట. భవిష్యత్తును దర్శించడం యోగులకు, ఋషులకు సాధ్యమే. మన పురాణ పురుషుల సంగతి వదిలేసినా, చరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యద్దర్శనం చేసిన వారు ఉన్నారు.
- ఇతర దేశాలలోనూ భవిష్యత్ ను తెలుసుకొని, జరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రోడామస్ అయితే తెలుగువారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్రస్వామి. రష్యా, టిబెట్, చైనా వంటి సుదీర్ఘ చరిత్ర కలిగి, ప్రాచీన నాగరికతలు వెల్లివిరిసిన దేశాలలో భవిష్యద్దర్శనం చేసిన కొందరి పేర్లు మనకు వినిపిస్తుంటాయి. వారి గురించిన చారిత్రక వివరాలు గ్రంథస్తం చేసి ఉన్నాయి.
- కాలజ్ఞానం ఒక విధంగా జ్యోతిష్యం వంటిదనే చెప్పుకోవాలి. జ్యోతిష్యం గ్రహగతుల ఆధారంగా కొందరు వ్యక్తుల జీవితంలో భవిష్యత్ లో జరగబోయే సంగతులను వివరించి చెప్పేది. ఈ జ్యోతిషంలోనూ అనేక పద్దతులు ఉన్నాయి. నాడీ జోస్యం, హస్తసాముద్రికం తదితరాలు. అవి ఇప్పుడు అప్రస్తుతం.
- కాలజ్ఞానం జ్యోతిషానికి భిన్నమైనది. ఇది ఒక దేశ, ప్రపంచ పోకడలను వివరించేది. భవిష్యత్తులో సాంకేతికంగా వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, దేశానికి ఏర్పడే ముప్పులు, పెను విపత్తులు, ప్రముఖ వ్యక్తుల జననం, వారి జీవనం ఇలాంటి సంగతులు ఎన్నిటినో వివరిస్తుంటుంది. నాస్ట్రోడామస్, వీరబ్రహ్మేంద్రస్వామి చేసింది సరిగ్గా ఇదే! నాస్ట్రోడామస్, చెప్పినా, వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినా వారి జోస్యాలలో స్పష్టత ఉండదు. అస్పష్టతే ఎక్కువ. సూటిగా ఉండవు. మర్మగర్భంగా ఉంటాయి. అలాగని వారేదో ఊహాప్రపంచంలో విహరించి, వారికి తోచిందేదో రాసేశారు అనుకోడానికీ లేదు. ఎందుకు రాశారు అన్నదీ ఆలోచించాలి. నాస్ట్రోడామస్, నే ఉదాహరణగా తీసుకుంటే …. హిట్లర్, నెపోలియన్ వంటి ప్రముఖుల ప్రస్తావన నాస్ట్రోడామస్ జోస్యంలో కనిపిస్తుంది. రాజీవ్ గాంధి హత్య, ప్రపంచ వాణిజ్య భవన సముదాయం కూల్చివేత వంటి విపత్కర సంఘటనలకు నాస్ట్రోడామస్ జోస్యాలు కొన్నింటికి అన్వయం కుదురుతుంది. మరి ఆయన చెప్పింది వీరి గురించేనా? అనేది స్పష్టంగా చెప్పలేము. అయితే, వీటిని ఎక్కువమంది నమ్ముతారు.
- వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిందీ ఇలాంటివే! నాస్ట్రోడామస్ ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను దర్శించారని ఆయన జోస్యాలను నమ్మినవారు భావిస్తునట్టే, రాష్ట్రంలో అనేక సంఘటనల గురించి వీరబ్రహ్మేంద్రస్వామి ముందుగానే భవిష్యద్దర్శనం చేసి చెప్పిన ఉదంతాలు కాలజ్ఞానంలో కనిపిస్తాయి.
- వీరబ్రహ్మేంద్రస్వామి జ్యోస్యాలలో కొన్ని సూటిగా వుంటే, మరికొన్నింటికి మనమే అన్వయం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇప్పటికే జరిగాయి, ఇంకా కొన్ని ఇకముందు జరగవలసి ఉన్నాయి. భవిష్యత్తులో జరగవలసి ఉన్నవాటిలో ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయం ‘కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అనేది. కృష్ణానది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు చేరుకునేంతగా ఎగసి పడుతుందా? లేక కనకదుర్గమ్మ ముక్కుపోగు నీటిని చేరుకుంటుందా అనేది మనం ఊహించలేము. ఈ రెండింటిలో ఎదైనా జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో జగరబోయే జలప్రళయాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి మనోనేత్రంతో దర్శించారు. జల ప్రళయమే అవసరం లేదు. ఏదైనా భూకంపం వంటి ప్రకృతి వైపరిత్యంవల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆనకట్టలకు బీటలు పడితే ఎగసి వచ్చే అపార జలరాశి చాలు. అలాంటి విపత్తు ఎదురైతే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. ఇక ముక్కుపుడక కృష్ణానదిని చేరుకోవడం అనే విషయాన్ని ఎవరికి తోచినట్లు వారు ఊహిస్తున్నారు.
కాలజ్ఞానంలో చెప్పినవి – ఇప్పటివరకు జరిగినవి
- కాశీ పట్న దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అని భవిష్య వాణి చెప్పాడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. అది ఎలా నిజమయిందో చూద్దాం. 1910 – 12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు.
- ఒక అంబ పదారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది…. ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలపాటు మన దేశానికి ప్రధానిమంత్రిగా వున్నారు. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంతకంటే ముందు సినిమా నటి. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సినీ రంగం నుంచి వచ్చినవారే! చిరంజీవి, విజయశాంతి, జమున- ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది తెరమీది నటులు రాజకీయాల్లో ప్రవేశించారు..
- రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ లేదు. ఆఖరికి జమీందారీ వ్యవస్థ కూడా నశించింది. ఉన్నదల్లా ప్రభుత్వము, మంత్రులూను. ఈ మంత్రులు వారసత్వం లాగా రారు. నిరంకుశత్వం ఉండదు. ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు. కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన మాట అక్షరాలా నిజమైంది.
- ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేకమంది మరణిస్తారు ఆకాశంలో పక్షి వాహనాలు నడుస్తాయని పోతులూరి చెప్పేనాటికి అసలు విమానమే పుట్టలేదు. పుష్పకవిమానం అంటూ పురాణ కధలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతం తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విమాన ప్రమాదాల్లో ఎంతోమంది మరణిస్తున్నారు.
- జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. ఒక్క భారతదేశ జనాభానే . వందకోట్లు దాటడం మితిమీరిన జనాభా పెరుగుదలకు నిదర్శనం. భవిష్యత్ లో అన్ని రకాల సమస్యలూ అధిక జనాభా గురించే మొదలవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటివారికి తెలియదు కానీ, వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు వుండేవి. ప్రస్తుతం ఎక్కాడా అగ్రహారాలు లేవు.
- హైదరాబాద్ లో తురకలు, హిందువులు పరస్పరం కిరాతకంగా చంపుకుంటారు…. పదిహేనేళ్ళ కిందటి వరకు కూడా హైదరాబాద్ లో మత కల్లోలాలు – అది కూడా కేవలం ముస్లిం, హిందువుల మధ్య మాత్రమే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక హుండీలో చోరీలు చాలా ఎక్కువగా వున్నాయి.
- చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ, చావు పుట్టుకలు మాత్రం కనుగోనలేకపోతారు. సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అన్ని రంగాల్లాగే వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. కాలు విరిగేతే రాడ్ వేస్తున్నారు. అసలు కాలే లేకుంటే కృత్రిమ కాలు పెడుతున్నారు. గుండె మార్పిడి దగ్గర్నించీ ఎన్నో అపురూపమైన శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి సాధించిన మాట నిజమే కానీ, చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకూ కనుక్కోలేదు. బహుశా, భవిష్యత్ లో కనుగొనగలరనే నమ్మకం కూడా లేదు.
- రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టేను రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. చివరకి ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలిగొన్న విషయం తెలిసిందే. ఎల్.టీ.టీ.ఈ. ప్రభాకరన్ హతుడైన సందర్భంలో ఇరుపక్షాలవారూ మృత్యువాతపడ్డారు.
- పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన జోస్యాల్లో ఎన్నో నిజమయ్యాయి. ఉదాహరణకు..గట్టివాడయిన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు .. ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడయిన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమయిన పాలనను అందించారు.
- కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. .వీరివల్ల ప్రజలందరూ మోసపోతారు.. ప్రస్తుతం గాల్లోంచి ఏవేవో వస్తువులు సృష్టించి ప్రజలను మోసం చేసే బాబాలు, కపట సన్యాసులు పెరిగిపోయారు. వీరికి ఏ మహిమలూ లేకపోయినా ప్రజలు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. పైగా ఈ దొంగ స్వాములు భోగవిలాసాలకు బానిసలుగా ఉన్నారు. ఎందరో దొంగ సన్యాసుల గుట్టు రట్టవుతోంది.
- దొంగ స్వాముల వల్ల నిజమైన యోగులకు చెడ్డ పేరు వస్తోంది. ఈ విషయం గురించి వీరబ్రహ్మేంద్రస్వామి 500 ఏళ్ళ కిందటే వివరించారు. ఈ విషయమొక్కటే చాలు వీరబ్రహ్మేంద్రస్వామి ఇప్పటి బాబాలు, నకిలీ యోగుల మాదిరిగా పేరు కోసం, డబ్బు కోసం, ఇతర సుఖాల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని రుజువు చేసేందుకు. అంతే కాకుండా నిజాలు తెలుసుకోకుండా యోగులందరూ దొంగలే అని వాదించే కొందరికి ఇది కనువిప్పు కలిగిస్తుంది. కాలజ్ఞానంలో ఇలాంటి అంశాలు కోకొల్లలు. వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన అన్ని విషయాలూ తెలుసుకోవాలంటే కాలజ్ఞానం చదవాలి.
కాలజ్ఞాన రచన:
వీరబ్రహ్మేంద్రస్వామికి వీరం భోట్లయ్య అనే పేరు కూడా ఉంది. ఈయన తండ్రి పేరు వీర భోజ్య రాయలు, తల్లి వీర పాపమాంబ. 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరబ్రహ్మేంద్రస్వామికి అపారమైన విజ్ఞానం ఏర్పడింది. ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులతో తక్కువగా మాట్లాడుతుండేవాడు. అద్భుత తత్వవేత్త ఆది శంకరాచార్యుల వలెనె వీర బ్రహ్మేంద్రస్వామి కూడా వివిధ విషయాలపై తాను జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా ఇతరులకు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. తండ్రి మరణించిన కొద్దికాలం తర్వాత తన తల్లిని వదిలి వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు నిర్ణయించుకుని తల్లి అనుమతి కోరాడు.
తల్లి పుత్రా ప్రేమవల్ల దీనికి అభ్యంతరం చెప్పింది. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి తల్లికి వివిధ రకాల విషయాల గురించి జ్ఞానాన్ని అందజేశాడు. అశాశ్వతమైన ఈ దేహం కోసం, బంధాలు, అనుబంధాల కోసం ప్రతి క్షణం తపించడం వృధా ప్రయాస అని తెలియచెప్పాడు. శరీర తత్వం ఎలా ఉంటుంది ? ఈ భౌతిక శరీరం ఆకాశం, గాలి, అగ్ని, నీరు, పృథ్వి అనే అయిదు అంశాలతో రూపొందుతుందని తల్లికి వివరించాడు వీరబ్రహ్మేంద్రస్వామి. వేదాల్లోనూ ఇదే ఉంది.
పంచభూతాల కలయికతోనే ”నేను” అనే భావన ఏర్పడుతుంది. ఈ సమస్త చరాచర ప్రకృతిని అర్ధం చేసుకునేందుకు మనకు చెవి, కన్ను, ముక్కు వంటి జ్ఞానేంద్రియాల వల్ల సాధ్యమౌతుంది. వీటి ద్వారా వివిధ రకాల పద్ధతులు, మార్గాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. అయితే వీటన్నిటినీ సమగ్రంగా అర్ధం చేసుకోడానికి ఉపయోగపడే తత్వమే నేను లేదా అహం. మనం సంపాదించే విషయ పరిజ్ఞానాన్ని మొత్తాన్ని మన మేధస్సు కు ఆర్దమవడానికి కారణం తత్వమే. ఈ పంచాంశాల వల్ల కామ, క్రోధ, మోహాలు కలుగుతాయి.ఇవి ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు ఆ జీవుడు లేదా బుద్ధి ఆ దిశగా చలిస్తూ ఉంటుంది. ఆత్మ అనేది నిమిత్తమాత్రంగా ఉంటూ అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది.ఏది మంచిదో, ఏది చెడ్డదో చెప్పడం వరకే దాని బాధ్యత. అంతే కానీ తప్పనిసరిగా ‘నువ్వు ఈ దిశలో వెళ్ళు’ అని ఆదేశించదు. ఆ విషయం బుద్ధి అధీనంలో ఉంటుంది. బుద్ధి, కర్మ అధీనంలో ప్రవర్తిస్తుంది. అందుకే ”బుద్ధీ కర్మానుసారిణీ” అని పెద్దలు చెప్తారు.
భౌతికంగా ఎంతటి గోప్పవాడయినా కర్మ నుండి తప్పించుకోలేదు. శ్రీకృష్ణుడు అంతటి మహాయోగి చివరికి ఒక బోయవాని బాణపు దెబ్బకు అడవిలో మరణించాడు. ఈ విషయాన్ని ఎవరు గ్రహిస్తారో, పరబ్రహ్మను ఎవరు ధ్యానిస్తారో వార్కికి దుఃఖం తగ్గుతుంది” – అని తల్లి౮కి వివరించాదు. వీరబ్రహ్మేంద్రస్వామి. తర్వాత ఈ జనన మరణ చక్రాన్ని శాస్వతంగా వీడిపోయేందుకు, మోక్షాన్ని సాధించేందుకు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పాడు పోతులూరి.
బ్రహ్మంగారు చేసే కొన్ని పనులు వినేందుకు చాలా విచిత్రంగా ఉండేవి. ఆయన ఒకవైపు కొండగుహలో కూర్చుని కాలజ్ఞానం రాస్తూ ఉండేవారు. మరోవైపు పశువుల కాపరిగా తన బాధ్యతను నిర్వర్తించేవారు.
తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చేందుకు బయల్దేరిన వీరబ్రహ్మేంద్రస్వామి బనగానపల్లెకు చేరారు. ఆరోజు పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయారు. రాత్రికి ఆ ఊరిలోని ఒక ఇంటి వద్దకు చేరారు. నిద్రా సమయం ఆసన్నం కావడంతో అక్కడున్న అచ్చమ్మ అనే స్త్రీ ఇంటిముందు ఉన్న అరుగుపైన నిద్రకు ఉపక్రమించారు. మరుసటిరోజు పొద్దున్నే అచ్చమ్మగారు, తన ఇంటి అరుగుమీద పడుకున్న వీరబ్రహ్మేంద్రస్వామిని చూశారు. ఈ సన్యాసి ఎవరో అని కుతూహలం కలిగి, ఆయనను వివరాలు అడిగారు. తాను బతుకుతెరువు కోసం వచ్చానని, ఏదో ఒక పని చేయదలచానని చెప్పగా, తన దగ్గర ఉన్న గోవులను తోలుకెళ్ళమని చెప్పింది అచ్చమ్మ. అలా గోవుల కాపరిగా మారిన వీరబ్రహ్మేంద్రస్వామి ఆవులను తీసుకుని దగ్గరలో ఉన్న రవ్వలకొండ దగ్గరకు వెళ్ళాడు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం ఆయనను ఎంతో ఆకర్షించింది. ఆ ప్రదేశాన్ని కాలజ్ఞానం రాసి, అందరికీ తెలియజెప్పేందుకు తగిన ప్రదేశంగా నిర్ణయించుకున్నారు. ఒక గుహను తనకు ఆవాసయోగ్యంగా చేసుకున్నారు.
ప్రతిరోజూ గోవులను తీసుకుని వచ్చి, వాటిని పొలంలో వదిలిపెట్టి మనసును కేంద్రీకరించి ధ్యానంలో మునిగిపోయేవారు. ఆ ధ్యానం వల్ల ఆయనకు రకరకాల అనుభవాలు కలిగేవి. వాటన్నిటికీ అక్షరరూపం కల్పించేవారు. కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ ఉన్న ఒక తాటిచెట్టు ఆకులను కోసుకుని, కొండ గుహలో రాయడం మొదలుపెట్టాడు.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవులకోసం రేఖ:
అయితే తాను కాలజ్ఞాన గ్రంధం రాయడంలో నిమగ్నమయ్యే సమయంలో గోవులు అచ్చమ్మగారి పొలం దాటి వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోతూ ఉండేవి. ఇలా జరగకుండా వుండేందుకు ఒక పుల్లతో ఆ గోవుల చుట్టూ పెద్ద వలయం గీశాడు. ”ఈ వలయం దాటి మీరు ఎక్కడికీ వెళ్ళవద్దు” అని గోవులను ఆదేశించాడు. తర్వాత ప్రశాంతంగా తన కాలజ్ఞానాన్ని కొనసాగించారు. పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. రకరకాల సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు.ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు? ఇలా ఎందుకు చేశారు? అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు. ఒకరోజు మామూలుగా తన విధి నెరవేర్చేందుకు పశువులను తోలుకుని కొండకు బయల్దేరారు వీరబ్రహ్మేంద్రస్వామి.
యధాప్రకారం గోవుల చుట్టూ ఒక వలయం గీసి, కాలజ్ఞానం రాసుకునేందుకు తాటియాకులు, చెట్ల ముళ్ళు కోసుకుని కొండ గుహలోకి వెళ్ళిపోయారు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమ్మ ఇదంతా చూసి ఒక అద్భుతాన్ని చూసిన విధంగా ఆశ్చర్యంలో మునిగిపోయింది. తన దగ్గర గోవులకాపరిగా పనిచేస్తున్న వీరబ్రహ్మేంద్రస్వామి ఒక జ్ఞాని అని అప్పుడు తెలుసుకోగలిగింది అచ్చమ్మ. కానీ, గుహలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడటానికి భయపడింది. తపస్సు చేస్తున్న మాదిరిగా కాలజ్ఞానాన్ని రాస్తున్న బ్రహ్మంగారి ఏకాగ్రతను భగ్నం చేసేందుకు ఆవిడ భయపడింది. అప్పటికి ఆయనతో ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది.
వీరబ్రహ్మేంద్రస్వామి గోవులను తోలుకుని తిరిగి రాగానే ఆయన పాదాలకు నమస్కరించి, తెలీక తాను చేసిన తప్పులన్నిటినీ మన్నించమని కోరింది. ”నాకు దూషణ అయినా, భూషణ అయినా ఒక్కటే. నీవయినా, తల్లి అయినా ఒక్కటే. ఈ ప్రపంచంలోని జీవులన్నీ నాకు సమానమే” అని చెప్పిన బ్రహ్మంగారిని తనకు జ్ఞానోపదేశం కలిగించమని కోరింది అచ్చమ్మ. ఆ పని ప్రస్తుతం చేసేందుకు వీలు లేదని, సమయం వచ్చినప్పుడు యాగంటి అనే పుణ్యక్షేత్రంలో జ్ఞానోపదేశం చేయగలనని, చెప్పారు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆరోజు కోసం ఎదురుచూడసాగింది అచ్చమ్మ.
వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రం యధాప్రకారం కాలజ్ఞానాన్ని రాసి, అచ్చంమగారి ఇంటిలో ఒకచోట పాతిపెడుతూ ఉండేవారు. ఒక శుభదినాన అచ్చమ్మగారిని ఈశ్వర క్షేత్రమైన యాగంటి’కి తీసుకుని వెళ్లారు వీరబ్రహ్మేంద్రస్వామి. అక్కడ జ్ఞానోపదేశం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ సామాన్యులకు అర్ధమయ్యే విధంగా సరళమైన భాషలో జవాబులిచ్చారు వీరబ్రహ్మేంద్రస్వామి.
వాటిలో కొన్ని:
పరమాత్మ ఎక్కడ ఉన్నాడు?
పరమాత్మ ప్రపంచంలో అణువణువునా ఉన్నాడు. ఈ పశువులలో, నీలో, నాలో, కీటకాలలో.. అన్నిటిలోనూ ఆయన నివాసం ఉంటుంది.
దేవుని తెలుసుకోవడం ఎలా?
దేవుని తెలుసుకోడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ భక్తి, ధ్యానం శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే కేవలం భగవంతుని ధ్యానిస్తూ జీవితాన్ని గడపడమే. దీన్నే భక్తి యోగం అని కూడా అంటారు. ధ్యాన యోగం అంటే ప్రాణాయామం ద్వారా ఈ సృష్టిని ప్రారంభించిన బ్రహ్మ ను తెలుసుకోవడమే.
దేవుని ఏ రూపంలో మనం చూడగలం? స్త్రీయా, పురుషుడా?
పరబ్రహ్మ నిరాకారుడు, నిర్గుణుడు. మనం ఏ విధంగానూ నిర్వచించలేము.
ఈ విధంగా అచ్చమ్మగారి సందేహాలను తీర్చిన తర్వాత ఆమెకు కొన్ని మంత్రాలను ఉపదేశించారు వీరబ్రహ్మేంద్రస్వామి. వీటిని ఏకాగ్ర చిత్తంతో జపిస్తూ ఉండమని చెప్పారు. తర్వాత కాలజ్ఞానం గురించి వివరించడం మొదలుపెట్టారు. వీరబ్రహ్మేంద్రస్వామి తనకు తెలిసిన భవిష్యత్ విషయాలను వివిధ సందర్భాల్లో చెప్పుకుంటూ వెళ్లారు. అంతే కాకుండా వీరబ్రహ్మేంద్రస్వామి వివిధ ఊళ్లు తిరుగుతూ ఉండేవారు. ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ తినేవారు, విశ్రమించేవారు. కాలజ్ఞాన ఉపదేశం చేసేవారు. అందువల్ల కాలజ్ఞానం ఒక క్రమ పద్ధతిలో ఉండదు.
వీరబ్రహ్మేంద్రస్వామి తాను రాసిన కాలజ్ఞానంలో ఎక్కువ బనగానపల్లెలో ఒకచోట పాతిపెట్టారు. తర్వాత దానిపైన ఒక చింతచెట్టు మొలిచింది. ఈ చింతచెట్టు వయసు 4,5 వందల సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించారు. ఈ చింతచెట్టుకు స్థానికులు పూజలు చేస్తూ ఉంటారు. ఈ చెట్టునుంచి కొన్నిసార్లు ఎర్రని ద్రవం వస్తుందని, స్థానికులు చెప్తారు. ఈ చెట్టుకు కాసే చింతకాయలు తినేందుకు పనికిరాకపోవడం ఆశ్చర్యం.
వీరబ్రహ్మేంద్రస్వామి, అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తూ ఉంటారు.
అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం:
- వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వావీ వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు: ఇది అక్షర సత్యం అయింది. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చినవారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి.
- రాజులు తమ ధర్మాన్ని మరిచిపోతారు. వారు విలాసాలు, విందుల్లో మునిగితేలుతూ ఉంటారు. ధర్మభ్రష్టులవుతారు: ఇక్కడ రాజులు అంటే, పాలకులు అని అర్ధం. వారు రాజులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులు కావచ్చు. అనేక రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, దేశాల ప్రధాన మంత్రులు కూడా అవినీతి కుంభకోణాలలో చిక్కుకోవడం పత్రికల ద్వారా ప్రజలకు వెల్లడి అవుతోంది. పార్టీ ఏదైనా ప్రజా ప్రతినిధులు అత్యధిక శాతం అవినీతికి పాల్పడుతున్నారు.
- శాంతమూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది. వివిధ వర్ణాలవారు తమ ఆచారాలను వదిలి ఇతరుల ఆచారాలను అనుసరించి నాశనమవుతారు: నిజమే కదా.. మానసిక వత్తిడి విపరీతంగా పెరిగిన దరిమిలా శాంతమూర్తులు కూడా ఆవేశానికి, ఆగ్రహానికి లోనవడం మనం చూస్తూనే ఉన్నాం.
- పైర్లు సరిగా పండవు. పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల కరువు భయంకరంగా పెరుగుతుంది: మొదట తెలంగాణా లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే కరువు ఉండేది. ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు పెరిగిపోయింది. దీన్ని తట్టుకోలేక రైతులు పొలాలను వదిలేసి కూలీలుగా పట్నాలకు వలస వెళ్లిపోవడం సాధారణంగా మారిపోయింది. నీటికి కరవులేని కోస్తా జిల్లాల్లో కూడా ఇప్పుడు కొత్తగా నీటి సమస్య మొదలైంది. దీనివల్ల పంటలు కూడా పండని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- బ్రాహ్మణులు తమ ధర్మాలను, పౌరోహిత్యం వదిలి ఇతర కర్మలను చేపడతారు. దానివల్ల అంతా అల్లకల్లోలంగా మారుతుంది: పోతులూరి చెప్పిన కాలంలో ఇది విడ్డూరమే. అప్పట్లో ఏ కులంవారు, ఆ కులవ్రుత్తి చేపట్టేవారు. ఇప్పుడు కులవృత్తులు లేవు. ఎవరికీ ఏ పని ఇష్టమైతే, ఆ పనిలో స్థిరపడుతున్నారు.
- చోళ మండలం నష్టమైపోతుంది: తుఫానులు ఎక్కువగా తమిళనాడు తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఈ కారణంవల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఏనుగుకు పంది పుడుతుంది. పందికి కోడి పుడుతుంది. ఇలాంటి వింత సంఘటనలు తరచుగా పేపర్లలో చదువుతూనే ఉన్నాం. కుక్కకు పిల్లి, పంది కడుపున కోతి పుట్టిన ఉదంతాలు ఫొటోలతో సహా వార్తల్లో చూశాం. వివిధ జన్యు కారణాలవల్ల ఇలా జరుగుతోందని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. వీటిని ఏ విధంగానూ ఆపలేమని కూడా శాస్త్రజ్ఞులు చెప్పారు.
- వావీవరసలు తగ్గిపోతాయి. తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషించడం చాలా సాధారణం అవుతుంది: తండ్రీకొడుకులు ఒకర్నొకరు దూషించుకోవడమే కాదు, హత్యలు చేసుకోవడం ఎక్కువయ్యాయి. ఆస్తి పంచి ఇవ్వలేదనే కోపంతో తండ్రిని, తల్లిని హత్య చేసిన కొడుకుల కధలు ఎన్నో ఉన్నాయి. తాను చెప్పిన మాట వినలేదని కొడుకును, కోడళ్లను తండ్రి తగలబెట్టాడనే కధనం ఆమధ్య వార్తల్లో వచ్చింది. పైగా ఆ తండ్రి ఒక వైద్యుడు కూడా. ఇలాంటి వార్తలు కొల్లలుగా వింటున్నాం. కనుక బ్రహ్మంగారి మాట బ్రహ్మవాక్కే.
- శిలలు కండలు కక్కుతాయి. ఆ కండలు తినేందుకు ఆకాశం నుంచి గద్దలు వచ్చి నేలపైన వాలతాయి. వెంటనే చస్తాయి. ఆ చచ్చినవాటిని పట్టుకుని ప్రజలు గంతులు వేస్తారు:
- ప్రజలు కొరువులు (సిగరెట్లు, బీడీలు కావచ్చు) నోట కరచుకుని తిరుగుతారు. కొండలు మండుతాయి: చిన్నాపెద్దా తేడా లేకుండా, ఆడా మగా తారతమ్యం లేకుండా ఎందరో సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. బహుసా ఇది ఇంకా పెరుగుతుంది కావచ్చు. ఇక కొండలు మండటం అంటే, అగ్ని పర్వతాలు అని సూటిగానే తెలుస్తోంది. నిజానికి అగ్ని పర్వతాలు భారతదేశంలో ఎక్కడా లేవు. ఇవి ఆగ్నేయాసియా దేశాల్లో, యూరప్ దేశాల్లో మాత్రమే కనపడతాయి. వాటిని గురించి బ్రహ్మంగారు 500 ఏళ్ళ కిందట చెప్పటం ఆశ్చర్యకరంగా ఉంది.
- జనుల కడుపులో మంటలు పుడతాయి. నోట్లో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాలపాలయి జనులు మరణిస్తారు. అలాగే పశువులు, క్రూర మృగాలు కూడా చస్తాయి: పూర్వంతో పోలిస్తే ఇప్పుడు వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. అయినా సరే, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. క్షయ లాంటి ఎన్నో జబ్బులకు అద్భుతమైన మందులు కనిపెట్టారు. కానీ, కాన్సర్, ఎయిడ్స్ లాంటి వ్యాధులు భయపెడుతున్నాయి. దీనికి పంటల్లో వాడే ఎరువులు, వాతావరణ కాలుష్యం, మన అలవాట్లు, జీవనశైలి లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొత్తానికి ఈ పరిణామాన్ని వందల సంవత్సరాల కిందటే చెప్పడం అద్భుతం. అణు బాంబుల వల్ల అణు ధూళి ఏర్పడుతుంది. దీనివల్ల బ్లడ్ కాన్సర్ , ఇతర రోగాలు వస్తాయి. నోట్లో బొబ్బలు రావడం కూడా అణు ధూళి చూపించే ప్రభావం వల్లే. అణు బాంబు ప్రభావం వల్ల మనుషులే కాకుండా క్రూర మృగాలు, పశువులు కూడా కోట్ల సంఖ్యలో మరణించాయి. మొత్తమ్మీద ఇక్కడ చెప్పినవి అన్నీ అణు బాంబుల వల్ల కలిగే దుష్పరిణామాలే అని అర్ధం చేసుకోవచ్చు.
- దుర్మార్గులే రాజులుగా మారతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు: లోకమంతా అవినీతిమయంగా ఉంది. నేరగాళ్ళు, మోసగాళ్ళు ప్రజా పాలకులుగా మారుతున్నారు. మనదేశంలోనే కాదు, అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలను పాలించేవారు అవినీతిపరులు, దుర్మార్గులు ఉండటం చూస్తూనే ఉన్నాం. ధనవంతులు మాత్రమే పాలకులుగా మారుతున్నారు. వారికి ధన సంపాదనే ధ్యేయం. ఈ ప్రయత్నంలో సామాన్య ప్రజల కష్టాల గురించి ఎవరికీ పట్టడం లేదు. ఒక పేదవాడు నేతగా మారటం దుస్సాధ్యంగా మారింది.
- మత కలహాలు పెరిగి ఒకర్నొకరు చంపుకుంటారు: దేశ విభజన సమయంలో కూడా హిందువులు, ముస్లింలు ఒకర్నొకరు చంపుకున్నారు. ఇటీవల కూడా గుజరాత్ లో నరమేధం జరిగింది. ఇక్కడ ముందుగా ముస్లింలు మత కల్లోలాలను ప్రారంభించారు. వారు రైల్లో ప్రయాణిస్తున్న కొందరు హిందువులను సజీవదహనం చేయడంతో, హిందువులు ముస్లింలను వందల సంఖ్యలో హతమార్చారు. ఇలాంటి విషాదకర సంఘటనలు పెచ్చుమీరుతున్నాయి. క్రమంగా అన్ని మతాల్లోనూ ఉన్మాదుల సంఖ్య పెరిగిపోతోంది.
- అడవి మృగాలు అడవులలో నుంచి గ్రామాలు, పట్టణాల లోకి ప్రవేశిస్తాయి.. మానవులను చంపుతాయి: పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దానివల్ల వారు పొలాల కోసం, కలప కోసం లక్షల ఎకరాల్లో అడవులను నరికి, వాటిలో పంటలు పండిస్తున్నారు. ఫలితంగా అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. దీనివల్ల అక్కడ ఉండాల్సిన పులులు, ఏనుగులు, జింకలు, ఎలుగుబంట్లు మొదలైనవి ప్రజలు నివసించే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. మనుషులను హతమారుస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి.
- నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు: బ్రహ్మంగారు పుట్టి, జ్యోతిష్యం చెప్పిన సమయానికి మారుమూల పల్లెలే కాదు, పట్నాల్లోకి కూడా ఎలక్ట్రిక్ దీపాలు రాలేదు. అసలు వాటి గురించి ఎవ్వరూ ఊహించలేదు కూడా. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది. కరంట్ ఉత్పత్తిలోని సూత్రం ఇదే. నీటినుంచే విద్యుత్తు వస్తోంది.ఈ శక్తి నీళ్ళ నుంచి ఆవిర్భవిస్తోందనేది మనందరికీ తెలుసు. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ళ కిందటే బ్రహ్మంగారు చెప్పగలగడమే విచిత్రం.
- విదేశీయులు వచ్చి భారత దేశాన్ని పరిపాలిస్తారు: మరీ ప్రాచీనకాలంలో చూస్తే హూణులు తదితరులు, ఆ తర్వాత ముస్లింలు, తర్వాత డచ్ వారు, పోర్చుగీసువారు, తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించారు. వందల సంవత్సరాలు పాలించారు. భారతీయుల్లో సహజంగా ఉన్న అనైక్యత వల్లే విదేశీయులు మనదేశాన్ని పరిపాలించగలిగారు. ఈ పరిణామాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి ఎన్నడో ఊహించారు.
- మాచర్ల లోని రాజులందరూ ఒక స్త్రీ కారణంగా తన్నులాడుకుని మరణిస్తారు; పల్నాటి యుద్ధం గురించి చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలే కదా! నాయకురాలు నాగమ్మ వల్ల పల్నాడు స్మశానంగా మారిపోయింది. చిన్న చిన్న పట్టింపులు, పౌరుషాల వల్ల యుద్ధం జరిగి వేలాదిమంది హతమారిపోయారు.
- పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. దీనివల్ల కొన్ని గ్రామాల్లో ప్రజలు మరణిస్తారు: దీని గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వలేము. ఇది విమానాల్లో నుంచి వదిలే బాంబులు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వియత్నాం యుద్ధంలో జరిగింది ఇదే. అక్కడ ఎక్కువగా గ్రామాలపైనే అమెరికా సేవలు దాడులు జరిపాయి. అక్కడ వామపక్ష గెరిల్లాలు గ్రామాలనుంచే తమ సాహసోపేతమైన పోరాటం చేశారు. అమెరికా సేనలను భయకంపితులను చేశాయి.
- ఒకరి భార్యను మరొకరు వశపరచుకుంటారు. స్త్రీ, పురుషులు కామంచేత పీడితులవుతారు: ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు స్త్రీ, పురుషుల్లో కామ వాంఛ పెరిగింది. నైతిక విలువలు క్రమంగా తగ్గుతున్నాయి.
- వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాలను దోచుకుంటారు: ఇప్పుడు ప్రతిరోజూ ఏదో ఒక దేవాలయంలో దొంగలు పడటం మామూలయింది. ఒక్క వెంకటేశ్వర దేవాలయం అని ఏమిటి.. అన్ని దేవాలయాల్లో దొంగతనాలు సాధారణం అయ్యాయి. మహమ్మదీయులు వందల సంఖ్యలో హిందువుల దేవాలయాలను సర్వనాశనం చేశారు. గుజరాత్ లోని అత్యంత సుసంపన్నమైన సోమనాథ ఆలయం మీద ముస్లిం చక్రవర్తుల వరుసగా అనేకసార్లు దండయాత్రలు చేసి అక్కడి సంపదను మొత్తం దోచుకుని వెళ్లారు.
- 5 వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది: ఈ కాల పరిణామం సరస్వతీ నది విషయంలో అక్షరాలా జరిగింది. వేదకాలం నాటి సరస్వతీనది ప్రస్తుతం అంతర్ధానమై పోయినా, శాటిలైట్ ద్వారా ఆ నది గతంలో ప్రవహించిందని శాస్త్రవేత్తలు ధ్రువీకరించిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. గంగ విషయంలో జరుగుతుందో లేదోననే సందేహమే అక్కర్లేదు. ఇప్పటికే గంగానది ఉధృతి తగ్గింది. ఎండిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
- చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి.. కృష్ణానది మధ్య ఒక బంగారు తేరు పుడుతుంది. దాన్ని చూసినవారికి ఆ కాంతివల్ల కనులు కనబడవు: ఇది ఇప్పటివరకూ జరగలేదు కానీ, ఇకముందు జరిగే అవకాశం ఉంది.
- ప్రపంచంలో ఇకముందు పాపుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది: దీనికి సాక్ష్యాలు, నిదర్శనాలు అక్కరలేదు కదా! కళ్ళముందు కనిపిస్తున్న సత్యమే. ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. అంటే, న్యాయం, ధర్మం ఒంటి కాలిమీద నడుస్తున్నాయి. మంచివారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మోసం, ద్వేషం రాజ్యమేలుతున్నాయి. క్షీణించిపోతున్న ధర్మాన్ని కాపాడి, పాపాత్ములను శిక్షించేందుకు నేను ఐదువేల ఏళ్ళ తర్వాత వీరభోగ వసంతరాయలుగా తిరిగి అవతరిస్తాను. .అప్పుడు నా భక్తులందరూ తిరిగి నన్ను చేరుకుంటారు. .. దీనికి ఇంకా చాలా సమయం ఉంది. వందల ఏళ్ళు జరగాల్సిఉంది.
- విజయనగరం కొన్నాళ్ళు అత్యంత వైభవంగా వెలుగుతుంది. ఆ తర్వాత ప్రాభవం కోల్పోయి నాశనమైపోతుంది: ఇది ఒక చారిత్రక వాస్తవం. శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్యంలో అంతః కలహాలు ఏర్పడి, అసమర్థులు, భోగలాలసులైన చక్రవర్తుల నేతలుగా మారారు. మరోవైపు మహమ్మదీయుల దండయాత్రల వల్ల ఆ మహా సామ్రాజ్యం బలహీనమవడం ప్రారంభించింది. మిగిలిన భారతీయ రాజుల మాదిరిగానే కర్నాటక, ఆంధ్ర ప్రాంత రాజుల్లో అనైక్యత వల్ల కూడా విదేశీయులైన మహమ్మదీయులు విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయగలిగారు.
- వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు: వేంకటేశ్వరునికి మహమ్మదీయ వనిత బీబీ నాంచారి భార్య అనే విషయం అందరికీ తెలిసిందే. బీబీ నాంచారిని మహమ్మదీయులు పూజిస్తారు కాబోలు.
- కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చేను: కృష్ణా గోదావరి నదులు సముద్రంలో కలిసే చోటు మన రాష్ట్రంలోనే ఉంది. గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫానుల వల్ల వేల సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయం అందరికీ తెలుసు.
- తూరుపు నుంచి పడమర వరకు ఆకాశంబున యోజన ప్రమాణం వెడల్పుగా చెంగావి చీర కట్టినట్టు కనపడుతుంది: ఇది కూడా అణ్వస్త్రాల వల్ల కలిగే ఫలితమే. అణుబాంబు వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్టు కనబడ్డాయి.
ఇలా వీరబ్రహ్మేంద్రస్వామి, అచ్చమ్మకు కాలజ్ఞానం ఉపదేశించారు. ఆయన బోధనల వల్ల క్రమంగా అచ్చమ్మలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోవడం మొదలై, జ్ఞానజ్యోతి ప్రజ్వరిల్లడం ప్రారంభం అయింది. అచ్చమ్మ గారి ద్వారా క్రమంగా బ్రహ్మంగారి గురించి అందరికీ తెలిసింది. ఆయనకు ఒక శిష్యగణం తయారైంది. తన శిష్యులకు, భక్తులకు జ్ఞాన బోధ చేస్తూ కాలం గడపడం మొదలుపెట్టారు బ్రహ్మంగారు.
అచ్చమ్మ కుమారుడికి దృష్టిని ప్రసాదించడం
అచ్చమ్మకు ఒక కుమారుడు ఉండేవాడు. అతడి పేరు బ్రహ్మానందరెడ్డి. అతనికి అంధత్వం ఉండేది. ఎంతమంది వైద్యులను సంప్రదించినా అతనికి ఇక చూపు రాదనీ తేల్చి చెప్పారు వారు. అచ్చమ్మ బ్రహ్మంగారికి తన కుమారుడి విషయం చెప్పింది. అతనికి పూర్వజన్మ ఖర్మం వల్ల చూపు పోయిందని ఆయన చెప్పారు. దృష్టి తెప్పించమని అచ్చమ్మ అడగగా, తగిన సమయంలో ఆ పని చేస్తానని అప్పటివరకూ ఓపిక పట్టమని బ్రహ్మంగారు సూచించారు.
ఒకసారి అన్నాజయ్య అనే దైవభక్తిపరుడు బ్రహ్మంగారి మఠానికి వచ్చారు. ఆయనకు తన కాలజ్ఞానం వినిపించాలని నిర్ణయించుకున్నారు. ఇది పూర్తయిన తర్వాత బ్రహ్మంగారు అచ్చమ్మను పిలిచారు. ”తల్లీ, నీ కుమారుడు గత జన్మలో ఒక మహిళ దృష్టి కోల్పోవడానికి కారకుడయ్యాడు కాబట్టే, ఈ జన్మలో ఇలాంటి దుస్థితి ఏర్పడింది. అయినప్పటికీ నేను అతనికి తిరిగి దృష్టిని ప్రసాదించగలను” అన్నాడు. తర్వాత బ్రహ్మానందరెడ్డిని పిలిచి అతని నేత్రాలను స్పృశించారు. బ్రహ్మానందరెడ్డికి అప్పటినుంచి కళ్ళు మళ్ళీ కనబడటం ప్రారంభమైంది.
అన్నజయ్యకు చెప్పిన కాలజ్ఞానం:
ఈ కాలజ్ఞానం లోని కొన్ని సంగతులు గతంలో అచ్చమ్మకు చెప్పినట్టుగానే కనబడుతున్నాయి.
- ఎంతోమందీ మార్బలం ఉన్న రాజులు కూడా సర్వ నాశనమైపోతారు. గ్రామాల్లో చోరులు పెరిగిపోతారు: గతంలో జరిగిన యుద్ధాల్లో ఈ పరిణామం సంభవించింది. శ్రీకృష్ణుని నిర్యాణం జరగబోయే ముందు కూడా జరిగినది ఇదే కదా. అర్జునుడు యాదవ స్త్రీలను తీసుకుని వస్తుంటే దారిలో చోరులు అర్జునుడిమీద, అతని సైన్యం మీద దాడి చేస్తారు. వారిమీద తన మహాస్త్రాలను ప్రయోగించ దలచుకున్నప్పటికీ ఒక్క అస్త్రం కూడా గుర్తురాక నిస్సహాయుడైపోతాడు అర్జునుడు. అదంతా కలియుగ ప్రభావమే అని చెప్తాడు వ్యాసుడు.
- పిడుగులు పడి నదులు ఇంకిపోయేను: ఉల్కల వల్ల ఈ పరిణామం సంభవించవచ్చని కొందరి అభిప్రాయం. ఉల్కలు పడిన సమయంలో పిడుగు వంటి శబ్దాలు వస్తాయి. ఉల్కాపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమిమీద తిరుగాడిన మహాకాయులైన డైనోసర్లు తుడిచిపెట్టుకుపోయాయి. చిన్న పిడుగు పడితేనే ఎంతోమంది మనుషులు మరణిస్తున్నారు. అలాంటిది ఉల్క పడితే, ఏ ప్రమాదమయినా సంభవించవచ్చు.
- విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్టు, నిల్చున్నవారు నిల్చున్నట్టు హతమారిపోయేరు:
- రాత్రింబగళ్ళు గద్దలు గుంపులు కూడి అరుస్తాయి. నీటియండు చేపలు తాము చచ్చేమని తలచి బయటకు వస్తాయి:
- పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి, భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమౌతుంది:
- శ్రీశైలం శిఖరాన అగ్ని వర్షం పుడుతుంది. నందీశ్వరుడు రంకెలు వేస్తాడు. ఖనఖనమని కాలు దువ్వుతాడు:
- సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది. ఇది పురాణాలలో ఉంది. అశరీరవాణి తరచుగా సత్య నిర్ధారణ చేయడం ఎన్నొ సందర్భాల్లో మనం పురాణాలు, ఇతిహాలాసాల్లో కూడా చదువుకున్నాం. బహుసా అప్పుడు చెప్పిన అశరీరవాణి ఇదే కావచ్చు.
- విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు నిండుతుంది: మధ్యప్రదేశ్ లోని భోపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాదిమంది ప్రజలు మరణించగా, లక్షలాదిమందికి అనేక రుగ్మతలు కలిగాయి. ఆ దుర్ఘటన బాధితులకు ఇప్పటికీ పూర్తీ స్థాయిలో న్యాయం జరగలేదు.
- గ్రామాలలో, పట్టణాలలో నెత్తుటి వాన కురిసేను: రక్తం మాదిరిగా ఎరుపు రంగులో వానలు పడటం కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు చూశారు. వివిధ రసాయనాలు, వాతావరణ కాలుష్యం కారణంగా ఎరుపురంగు వర్షం పడుతోందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.
- సూర్యుడు, చంద్రుడు ఉన్నంతవరకు నా మఠానికి పూజలు జరుగుతూనే ఉంటాయి. నా మఠానికి ఈశాన్యం వైపు ఒక చిన్నదానికి చిన్నవాడు పుట్టేను.. అతడు ”నేనే భగవంతుడను నన్ను పూజించండి ” అని పలుకుతాడు:
- నెల్లూరు సీమ మొత్తం నీట మునిగి ఉంటుంది: తుఫాను సమయంలో నెల్లూరు మొత్తం జలమయం అవడం అనేక సంవత్సరాలుగా మనకు తెలుసు కదా.
నవాబుకు కాలజ్ఞానం వినిపించిన వీరబ్రహ్మేంద్రస్వామి
వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన జోస్యాలు, మహిమల గురించి బనగానపల్లె నవాబు విన్నాడు. అతనికి నమ్మకం కలగలేదు. అందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. పోతులూరి చెప్పేవి సత్యాలో కాదో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాక భటులచేత బ్రహ్మంగారిని పిలిపించాడు. ఆయనకు ఎదురువెళ్ళి నమస్కారం చేసి, స్వాగతం పలికాడు. తర్వాత ఆయనను ఒక ఆసనంపై కూర్చోబెట్టారు. నవాబు, తన సేవకుడిని పంపి స్వామివారు తినేందుకు పండ్లు, ఫలహారాలు తెప్పించాడు. అందులో మాంసాహారం పెట్టి తీసుకురమ్మని ముందుగానే పురమాయించాడు.
నవాబు ఆదేశాన్ని అనుసరించి, సేవకుడు కొన్ని మాంస ఖండాలను పళ్ళెంలో ఉంచి, వాటిపై వస్త్రం కప్పి, వినయంగా స్వామివారికి ఇచ్చాడు. ఆ పళ్ళెం పైనున్న వస్త్రాన్ని తీస్తే తాను ఫలహారం స్వీకరిస్తానని స్వామివారు చిరునవ్వుతో చెప్పాడు. ఆ సేవకుడు వస్త్రాన్ని తొలగించాడు. నవాబు ఆశ్చర్యపోయే విధంగా ఆ పళ్ళెంలో పుష్పాలున్నాయి. ఈ ఉదంతంతో వీరబ్రహ్మేంద్రస్వామి నిజంగా శక్తివంతుడే అని బనగానపల్లె నవాబు నమ్మక తప్పలేదు. వెంటనే నవాబు క్షమాపణ చెప్పాడు. తనకు కూడా కాలజ్ఞానం వినిపించాలని కోరాడు.
అప్పుడు బ్రహ్మంగారు నవాబుకు కొన్ని సంగతుల గురించి వివరించాడు. ఆయన చెప్పిన వాటిలో కొన్ని ముఖ్యమైనవి…
నవాబుకు చెప్పిన కాలజ్ఞానం:
విచిత్రమైన ఈత చెట్టొకటి పుట్టి రాత్రులు నిద్ర పోతుంది. పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరవు ఏర్పడుతుంది…
ఈ విషయం యదార్ధంగా జరిగింది. గుంటూరు జిల్లా చేబ్రోలు దగ్గర ఒక పొలంలో ఉన్న ఈతచెట్టు అచ్చం బ్రహ్మంగారి కధనాన్ని పోలి ఉండేది. రాత్రిపూట ఆ పొలంలో ఉన్న డొంక రోడ్డుకు అడ్డంగా పడుకునేది. మళ్ళీ సూర్యోదయం కాగానే లేచి నిలబడేది. ఈ వింత చెట్టు గురించిన విషయం అప్పట్లో ఫొటోలతో సహా దినపత్రికలో ప్రచురితమైంది.
కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ దాత్రు నామ సంవత్సరంలో అనేక ఊళ్ళల్లో రూపాయికి చారెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు.
ఇప్పటికే బియ్యం ధరలు మండిపోతున్నాయి. కిలో బియ్యం 40 రూపాయలు ఉంది. మరో ఐదేళ్ళలో కిలో 100 రూపాయలు పలికినా ఆశ్చర్యం లేదు. ఆకలి చావులు ఎక్కువయ్యాయి. కొన్నాళ్ళకి పేద ప్రజలకు బియ్యం అందుబాటులో లేకుండా పోతాయేమో!
బ్రహ్మంగారు తాను చెప్పినవన్నీ నిజాయితీతో, నిర్భీతితో చెప్పారు. నవాబును సంతోషపెట్టేందుకు కాకుండా తనకు ఏది నిజంగా అనిపించిందో దాని గురించే చెప్పుకుంటూ వచ్చారు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నా, ఈ కింద చెప్పినవి చదివితే ఈ విషయం సులభంగా అర్ధం అవుతుంది.
- 5000 సంవత్సరానికి వచ్చేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవ్వరూ మిగలరు. ఈ వంశానికి ఉన్న ఆస్తి అయిన గోవుల మందలో ఒక్క గోవు కూడా మిగలదు.
- బనగానపల్లె నవాబు పాలన క్రమంగా నాశనమైపోతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.
బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడం పూర్తయిన తర్వాత ఆయనకు 70 ఎకరాల భూమిని తన కానుకగా ఇచ్చాడు నవాబు. తన మఠానికి తిరిగి వచ్చిన తర్వాత బ్రహ్మంగారు మరల తన భక్తులకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపసాగారు.
దేశాటనకు బయల్దేరిన బ్రహ్మంగారికి ఒక సంవత్సరం గడిచిన తర్వాత దేశంలో పర్యటించి రావాలనే కోరిక పుట్టింది. తన కోరికను భక్తులు, శిష్యులకు చెప్పారు. వారెవ్వరూ దీనికి ఒప్పుకోలేదు. కానీ, అంతా ఆ సర్వేశ్వరుని నిర్ణయం ప్రకారమే జరుగుతుందని తన పర్యటనను ఆపేందుకు ఎవ్వరూ ప్రయత్నించరాదని నచ్చచెప్పారు స్వామి. ఆ తర్వాత కడప జిల్లాకు ప్రయాణమయ్యారు. ఆ జిల్లాలో తిరుగుతూ కందిమల్లాయపల్లె చేరుకున్నారు. ఆ ఊరు ఆయనకు బాగా నచ్చడంతో అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. ఆయన ఒక మామూలు వడ్రంగి మాదిరిగా జీవించడం మొదలుపెట్టారు. తన గురించి ఎప్పుడూ, ఎవరికీ చెప్పుకోలేదు.
ఇదిలా ఉంటే ఆ ఊరిలో ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ గుడిలో ప్రతి సంవత్సరం వేలాది రూపాయల ఖర్చుతో జాతర జరగడం ఆనవాయితీ. దీనికోసం ఊళ్ళో ఉన్న వారందరూ చందాలు వేసుకునేవారు. ఆ ఊరి పెద్దలు వడ్రంగి పని చేసే బ్రహ్మంగారి వద్దకు వచ్చి, అమ్మవారి జాతరకు చందా ఇమ్మని కోరారు. తాను పేదవాడినని, తానేమీ ఇవ్వలేనని చెప్పారు ఆయన. దాంతో పెద్దలు ఆయనను ఎగతాళి చేశారు. తప్పనిసరి పరిస్థితులలో తాను జాతరకు ఏదో ఒకటి ఇవ్వగలనని, కానీ అందుకోసం అమ్మవారి గుడి దగ్గరకు పెద్దలందరూ రావాలని చెప్పారు బ్రహ్మంగారు. ఆ మాటల ప్రకారం అందరూ కలిసి ఆ ఊరి దేవత గుడి దగ్గరకు వెళ్లారు.
గుడి బయట నిలబడిన బ్రహ్మంగారు ఒక చుట్ట తీసుకుని గుడిలోని అమ్మవారిని ఉద్దేశించి నిప్పు తీసుకురా అని కోరారు. వెంటనే అమ్మవారు అదృశ్య రూపంలో ఒక మూకుడులో నిప్పు తీసుకుని వచ్చి వీరబ్రహ్మేంద్రస్వామి వారికి ఇచ్చింది. ముక్కున వేలేసుకోవడం అందరి వంతయింది.
అన్ని మతాలనూ సమాదరించిన బ్రహ్మంగారు
వివాహం అయిన తర్వాత కొంతకాలం వరకు తన భార్యతో కలిసి జీవిస్తూ, తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ గడిపారు బ్రహ్మంగారు. ఆయన ఎక్కడా కూడా తనను తాను దేవునిగా కానీ దేవదూతగా కానీ ప్రకటించుకోలేదు. తనకు శిష్యులున్నారని కూడా ఆయన చెప్పలేదు. ఎప్పుడూ తన వద్దకు వచ్చే సామాన్య ప్రజల సందేహాలను తీర్చేందుకే ప్రయత్నించేవారు తప్ప తన గురించి, తన శక్తి గురించి చెప్పుకోలేదు. మహిమలను కూడా ఎప్పుడూ ప్రదర్శించలేదు. అందుకు ఆసక్తి వుండేది కాదు.
అందువల్ల బ్రహ్మంగారిని స్వామిజీగా ఎవ్వరూ గుర్తించలేదు. ఇలా అనేకంటే బ్రహ్మంగారికి ఇలా చెప్పుకోవడం ఇష్టం లేదని అనుకోవచ్చు.ఆయనను ఒక జ్ఞానిగానే గుర్తించారు తప్ప హిందూ మతానికి సంబంధించిన గురువుగా ఎవరూ గుర్తించలేదు. కాబట్టే ముస్లిం మతస్థులు కూడా ఆయన శిష్యులుగా వున్నారు. ఆయన మానవులందరినీ మతం దృష్టితో చూడలేదు. అందువల్లనే ఆయనకు అన్ని మతాల వారిలో గుర్తింపు వచ్చింది.
బ్రహ్మంగారి దేశ సంచారం:
కొన్నాళ్ళకి బ్రహ్మంగారికి దేశాటన చేయాలనే కోరిక పుట్టింది. కంది మల్లాయపాలెం నుంచి తన దేశాటనను ప్రారంభించారు. ముందుగా విజయవాడకు చేరి, కృష్ణానదీ తీరాన ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తర్వాత అక్కడి నుండి బయలుదేరి రాజమండ్రి, వరంగల్ ప్రాంతాల్లో తిరిగారు. వరంగల్ నుంచి హైదరాబాదుకు చేరారు.
హైదరాబాద్ నవాబు
అప్పటికే హైదరాబాద్ నవాబు బ్రహ్మంగారి గురించి తెలుసుకున్నాడు. బ్రహ్మంగారితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మంగారు హైదరాబాద్ వచ్చారని తెలుసుకుని తానూ ఆయనతో మాట్లాడతానని కోరుతూ కబురు పంపాడు. హైదరాబాద్ నవాబు ఆహ్వానం మేరకు బ్రహ్మంగారు నవాబును కలిశారు. బ్రహ్మంగారిని ప్రశ్నించిన నవాబు బ్రహ్మంగారిని కలిసిన నవాబు, ముందుగా తనకు ఆయనపై నమ్మకం లేదని చెప్పాడు. ఆయన జ్ఞాని అయితే కావచ్చు కానీ, దైవాంశ సంభూతుడు అంటే మాత్రం నమ్మలేనని, తనకు ఆయన ఏమైనా మహిమలు చూపితే తాను ఆయన భక్తునిగా మారగలనని అన్నాడు. మహిమలు ప్రచారం చేసుకోవడంలో బ్రహ్మంగారికి నమ్మకం లేకపోయినా, తన శక్తిని చూపించాలని నిర్ణయించుకున్నాడు.
ఒక గిన్నె నీటిని తెప్పించుమని నవాబును ఆదేశించాడు. సేవకుడు తెచ్చిన నీటిని ప్రమిదలో పోయించారు. తర్వాత ఆ దీపమును వెలిగించాడు. అది చూసిన నవాబు బ్రహ్మంగారిని భవిష్యత్ తెలుపగలిగిన జ్ఞానిగా గుర్తించాడు. రాజ్యం, అధికారం గురించి, తన వ్యక్తిగత విషయాలు భవిష్యత్ లో ఏ విధంగా వుంటాయో చెప్పమని ప్రార్థించాడు.
హైదరాబాద్ నవాబుకు చెప్పిన కాలజ్ఞానం:
అప్పుడు బ్రహ్మంగారు జోస్యం చెప్పారు. అదే జగత్ప్రసిద్ధమైన కాలజ్ఞానం. నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారము దాల్చి మళ్ళీ జన్మిస్తాను. ఈ సంఘటన జరగటానికి ముందు అనేక ఉత్పాతాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకీనదిలో సాలగ్రామములు నాట్యమాడతాయి. మనుషులతో మాట్లాడతాయి. నదుల్లో దేవతా విగ్రహాలు దొరకటం ఎన్నోసార్లు జరుగుతూనే ఉంది కదా! అలా వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన అనేక వాక్కులు ఇప్పటికి ఎన్నో జరిగి, యదార్థ సంఘటనలుగా కళ్ళముందు నిలిచాయి.
- ప్రయాగ తీర్థంలో చాలామంది మరణించగా, కొద్దిమంది బతుకుతారు: ప్రయాగ హిందువులకుపుణ్యతీర్థము. ఇక్కడ జరిగే ప్రమాదంలో భక్తులు మరణిస్తారు అని దీనికి అర్థం అయి వుండవచ్చు.
- సరస్వతీ దేవిని దుకాణాలలో అమ్ముతారు: చదువుకోవడం కంటే చదువు కొనడమే జరుగుతోంది. నిజంగానే విద్య అమ్మకపు వస్తువు అయింది. కష్టపడి చదవకపోయినా ఉత్తీర్ణుల్ని చేసే స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి. అదీ వీలవకుంటే తిన్నగా వెళ్ళి సర్టిఫికెట్లు కొనుక్కునే సౌకర్యాలు కూడా పుష్కలంగా ఉన్నట్టు ఎన్నోసార్లు వార్తలు వింటున్నాం. కనుక బ్రహ్మంగారు చెప్పినట్లు సరస్వతిని అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు.
- మూసీనది పొంగి నగరాన్ని ముంచేస్తుంది, ఆ వరదలలో ప్రజలు మరణిస్తారు. పల్లెలు పట్నాలుగా మారతాయి. చంద్రమతీ దేవి కళలు తొలగిపోతాయి: హైదరాబాదు విషయంలో ఈ వాక్కు రూఢి అయింది. 1908 లో మూసీ నదికి వరదలు వచ్చాయి.
- స్త్రీలు పర పురుషులతో యదేఛ్చగా తిరుగుతారు: ఈ విషయాన్ని బ్రహ్మంగారు చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే స్త్రీ, పురుషులలో కామ వాంఛ పెరిగి, వావి వరుసలు మాయమైపోతాయని అర్థం. తనను తాను తెలుసుకోగలిగిన యోగులకే నా దర్శనమవుతుంది.
- ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు: ఈ మాట వాస్తవమో కాదో అనే సందేహమే కలగదు. ఇప్పటికే బంగారం ధర చుక్కలను తాకుతోంది. మున్ముందు తులం బంగారం లక్షకు చేరుతుంది. ఇప్పటి పరిస్థితులు చూస్తే అందుకు సుదీర్ఘ కాలం కూడా అక్కరలేదు అనిపిస్తోంది. బహుశా వందేళ్ళ తర్వాత వీరబ్రహ్మేంద్రస్వామి మాటలు నిజమై ముత్యమంత బంగారం కూడా దొరక్కపోవచ్చు.
- తూర్పు దేశమంతా నవనాగరికతతో మెరిసి,తిరిగి ధనహీనులై దరిద్రులై పోతారు: తూర్పు దేశం అంటే జపాన్ అని చెప్పుకోవచ్చు.మొదటి ప్రపంచ యుద్ధంలో జపాన్ విజేతగా ఆవిర్భవించింది.తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా దెబ్బతింది జపాన్.అణుబాంబు వల్ల లక్షలాది మంది జపనీయులు మరణించగా,కొన్నిలక్షల మంది కాన్సర్ వంటి భయంకర వ్యాధులతోక్రమంగా మరణిస్తారు.
- ఇత్తడి బంగారమవుతుంది. బంగాళా దేశము గొప్పదే అయినా, అక్కడ నదులు ఉప్పొంగి, ప్రజలందరూ ఆ జలములోపడి నశించిపోయేరు: ఈ విషయం గురించి బ్రహ్మంగారు గతంలో కూడా చెప్పారు. బంగ్లాదేశ్ , పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో గంగానదికి తరచుగా వరదలు వస్తూ ప్రజలు మరణిస్తూ వుంటారు.
- ఇరవై అయిదుగురు అక్కాచెల్లెళ్ళు ఏకముఖులై దుర్గాదేవి కళ్యాణం చేసేందుకు వస్తారు… మళయాళమున, పశ్చిమమున, మహారాష్ట్రమున, కర్నాటకమున నాలుగు దేశములలో నా స్వరూపమును తెలుసుకుకొన్నవారు మోక్షాన్ని పొందుతారు. వివాహాలలో కులగోత్రాల పట్టింపులు మానుతారు.. జాతి, భేద, వర్ణాశ్రమ బేధాలు లేకనే ప్రవర్తిస్తారు: ఇది ప్రస్తుతం అందరూ చూస్తున్నదే ! క్రమంగా వివాహ విషయాలలో కులం పట్టింపు తగ్గుతోంది.అలాగే ఇతర విషయాలలో కూడా జాతి,కుల బేధాలు కనుమరుగవుతున్నాయి.
బ్రహ్మంగారి తిరుగు ప్రయాణం – శిష్యుల సంవాదం::
హైదరాబాద్ లో కొద్దికాలం గడిపిన బ్రహ్మంగారు తిరిగి తన ఊరికి రావాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మంగారికి సిద్దయ్య అనే వ్యక్తీ అభిమాన శిష్యుడిగా మారాడు.ఇది మిగిలిన శిష్యులకు కొద్దిగా కోపాన్ని కలిగించింది.బ్రహ్మంగారు కూడా సిద్ధయ్య మీద ఎక్కువ అభిమానాన్ని ప్రదర్శించేవారు. శిష్యుల్లో సిద్ధయ్య మీదా ఏర్పడిన భావాన్ని తొలగించాలని నిర్ణయించుకున్న బ్రహ్మంగారు అందుకు తగిన సమయం కోసం ఎదురుచూడటం మొదలు పెట్టారు.
హైదరాబాద్ నుంచి కడపకు పయనం సాగించారు బ్రహ్మంగారు, ఆయన శిష్య బృందం.ఆ మార్గ మధ్యలో స్వామివారు ఒక కుక్క కళేబరాన్ని సృష్టించారు.అది జీర్ణదశలో పురుగులతో నిండి,అతి దుర్గంధాన్ని వెదజల్లుతోంది.అందరూ ఆ దుర్గంధాన్నిభరించలేకపోయారు. బ్రహ్మంగారు ఆ కుక్క శరీరం వేపు నడవటం మొదలుపెట్టారు. ఆ కుక్క శరీరం నుంచి వస్తున్న దుర్గంధం భరించలేక, మిగిలిన శిష్యులందరూ కొంచెం వెనకగా నడవటం ప్రారంభించారు.అయితే, సిద్ధయ్య ఒక్కడూ మాత్రం వేరే ఎటువంటి ఆలోచన లేక, గురువునే అనుసరిస్తూ వచ్చాడు.
అందరూ ఆ కుక్క మృతదేహాన్ని సమీపించారు. వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ నిలబడి, శిష్యులను కూడా ఆగమని చెప్పారు. అప్పుడాయన తన శిష్యులతో – “మీరందరూ పెద్ద కులంవారమనీ సిద్ధయ్య కంటే తెలివితేటలు ఎక్కువగా వున్నాయనీ అనుకోవటం నేను గ్రహించాను. మీకు నిజంగా నేనంటే గురు భక్తి వుంటే, ఈ శుకనాన్ని తినండి.. అప్పుడే నేను మిమ్ముల్నినా నిజమైనా శిష్యులుగా గుర్తిస్తాను”అన్నారు. ఆ మాట వినటంతోటే శిశ్యులందరూ నిర్ఘాంతపోయారు.
‘దూరంగా నిలబడే, కుక్క శరీరం నుంచి వస్తున్న వాసనను భరించలేని తాము మాంసాన్ని ఎలా తినగలం ‘ అని ఆలోచించడం మొదలుపెట్టారు. అది గ్రహించిన బ్రహ్మంగారు సిద్దయ్యను, శునక మాంసాన్ని తినమని ఆదేశించారు. సిద్ధయ్య గురువుగారైన వీరబ్రహ్మేంద్రస్వామి మీద ఉన్న నమ్మకంతో క్షణం కూడా ఆలోచించకుండా ఆ మాంసాన్ని స్వీకరించాడు.
అప్పుడు స్వామి వారు శిష్యులవైపు తిరిగి “ఇప్పటికైనా సిద్ధయ్యకు గురువు అంటే ఎంత అభిమానము, గౌరవమో ఉన్నాయో తెలిసిందా?! నన్ను త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు. అహర్నిశలూ నా మాటమీద విశ్వాసము, గౌరవము ఉంచుతాడు. నేను ఏమని ఆజ్ఞాపించినా, దాన్ని నేరవేర్చే దృఢ సంకర్పం కలిగిఉంటాడు. అందుకే సిద్దయ్య అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ,అభిమానం. ఎవరైతే నన్ను అభిమానంతో కొలుస్తారో వారిని నేను గుర్తిస్తాను.వారే నా ప్రేమకు పాత్రులవుతారు ” అని చెప్పారు.
వీరబ్రహ్మేంద్రస్వామి అలా చెప్పడంతో శిష్యులందరూ తమ తప్పు తెలుసుకున్నారు. పశ్చాత్తాపం చెందారు. ”గురువుగారూ, మా తప్పులను క్షమించండి.మేం మీకు శిష్యులుగా వున్నప్పటికీ కులం,అహంకారం,గర్వం వంటి వాటిని దూరంగా తరిమివేయలేకపోయాము. ఆ కారణం వల్లే సిద్దయ్యపట్ల చులకన భావంతో తక్కువగా చూస్తున్నాము. మీ భోధనల వల్ల మా మనసులో పేరుకుపోయిన అంధకారం మాయమైంది ” అంటూ వినయంగా చెప్పారు.
వీరబ్రహ్మేంద్రస్వామి తన శిష్యులను పరీక్షించ దలచి, కుక్క మాంసం తినమని ఆజ్ఞాపించిన సందర్భంలో, వాళ్ళు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందారు. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి – “ఇప్పటికైనా మీరు నిజం గ్రహించారు. ఎవరయితే నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతారో, సేవిస్తారో, వారిమీద నేను ఎక్కువగా కరుణ చూపుతాను. దీనికి మీరు చేయవలసింది స్వార్థం వదిలివేయటమే !” అన్నారు.
ఈ సంఘటనతో సిద్దయ్య మాదిరిగా బ్రహ్మంగారి మిగిలిన శిష్యులందరూ కూడా స్వార్థ రహితంగా స్వామిగారిని సేవించడం మొదలు పెట్టారు. అనంతరం స్వామి ఆయన శిష్య బృందం తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ఒకరోజున మొత్తం ప్రయాణించిన తర్వాత బాగా అలసిపోవడంతో ఒక ప్రదేశంలో ఆగారు. అక్కడ విశ్రమించిన సమయంలో స్వామివారు తన శిష్యులతో ఆధ్మాత్మిక సంబంధమైన సంభాషణలు ప్రారంభించారు.
అలా కాలం గడుస్తుండగా బ్రహ్మంగారు హఠాత్తుగా తన శిష్యులలో ఒకరైన వెంకటయ్య వేపు తిరిగి “మరి కొద్ది సమయానికి ఒక అద్భుతం జరగబోతోంది ” అని తెలియజేశారు. ఆ తర్వాత మళ్ళీ తన శిష్యులతో సంభాషణలో మునిగిపోయారు. స్వామి వారు సిద్ధయ్యతో మాట్లాడుతూ వుండగా దగ్గరలో వున్న ఒక ప్రదేశం నుంచి ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు వినబడ్డాయి. అలా కొంతసేపు మాటలు వినిపించిన తర్వాత మళ్ళీ నిశ్శబ్దం…తర్వాత మళ్ళీ మాటలు వినబడ్డాయి.
అది గ్రహించిన స్వామివారు శిష్యుడు సిద్ధయ్యడు, ఇతర శిష్యులతో “వారెవరో తెలుసుకుందాం పదండి ” అని అందరినీ తన వెంట తీసుకుని అక్కడికి బయలుదేరి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా, ఒక బ్రాహ్మణ స్త్రీ,కుష్టు రోగియైన తన భర్తను, తన ఒడిలో వుంచుకుని విలపించడం కనిపించింది. అప్పుడు బ్రహ్మంగారు “ఏమమ్మా…మీరు ఎక్కడినుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? నీ భర్తకు ఈ వ్యాధి ఎలా వచ్చింది? మీ వివరాలన్నీ చెప్పండి ” అన్నారు.
ఆ బ్రాహ్మణ స్త్రీ చెప్పినవన్నీ విన్నతర్వాత :- బ్రహ్మంగారు “ఇక మీ కష్టాలన్నీ పోయినట్టీ. మీ గత జన్మ పాపం వల్లే ఈ వ్యాధి మీకు వచ్చింది. మిమ్ముల్నినేను ఆ పాపం నుంచి విముక్తి చేస్తాను” అని అభయమిచ్చారు. తర్వాత బ్రాహ్మణ యువకుని ఒక్కసారి తన చేతితో తడిమారు. అంతే… ఆ బ్రాహ్మణుని కుష్టువ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత బ్రహ్మంగారు ఆ దంపతులకు పంచాక్షరి మంత్రం ఉపదేశించారు. “స్వామీ, మీరు చేసిన ఉపకారం మేం ఎప్పటికీ మరిచిపోలేము. మీరు మా ఊరికి మాతోపాటు రావాలి. మా ఊరి వాళ్ళందరికీ మీ ఉపదేశాలతో జ్ఞానాన్ని కలగచేయాలి ” అని ప్రార్థించారు. “ఇప్పుడు నేను పర్యటనలో వున్నాను. తగిన సమయం వచ్చినప్పుడు మీరు పిలవకుండానే మీ ఊరికి వస్తాను” అని బదులిచ్చి వారిని పంపివేశారు. తనశిష్యులతోపాటు కందిమల్లాపాలెం జేరి తమ పనులలో నిమగ్నమయ్యారు బ్రహ్మంగారు.
బ్రహ్మంగారి పై నేరారోపణ:
ఒకరోజు వీరబ్రహ్మంగారికి కడప నవాబు నుంచి ఒక జాబు వచ్చింది. అందులో పేరి సాహెబు అనే ఒక ముస్లిం తన కుమారుడైన సిద్దయ్యను స్వామీజీ ప్రలోభ పెట్టి హిందువుగా మార్చారని స్వామిపై నేరారోపణ చేశాడు. దీని గురించి విచారించేందుకు బ్రహ్మంగారిని తాము కడపకు రమ్మని ఆదేశిస్తున్నామని ఆ లేఖలో సారాంశం.
ఆ లేఖ అందుకున్న వీరబ్రహ్మంగారు తాను నవాబు దగ్గరకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. శిష్యులు తాము కూడా కడపకు బయల్దేరి వస్తామని చెప్పగా, బ్రహ్మంగారు దానికి ఒప్పుకోలేదు. తాను ఒక్కడే అక్కడికి వెళ్తానని చెప్పారు. కానీ సిద్ధయ్య ,మాత్రం ఇది తనకు సంబంధించిన విషయం కాబట్టి, తాను మాత్రమే కడపకు వెళ్తానని, బ్రహ్మంగారు అక్కడికి రానక్కరలేదని చెప్పాడు. మొదట అందుకు ఒప్పుకోకపోయినా సిద్ధయ్య పట్టుపట్టడంతో అందుకు ఒప్పుకోక తప్పలేదు బ్రహ్మంగారికి. ఆ లేఖను తీసుకు వచ్చిన జవాన్లతో కలిసి కడపకు బయలుదేరాడు సిద్ధయ్య. మార్గమధ్యంలోనే జవాన్లను ఏమార్చి వారికి కనబడకుండా, వేరే మార్గంలో ముందుగానే కడపకు చేరుకున్నాడు సిద్ధయ్య. అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని వచ్చిన వారితో మాట సంబంధమైన సంభాషణలు మొదలుపెట్టాడు.
ముస్లిం మతస్తుడిని సిద్ధయ్యగా మార్చాడనే అభియోగం మోపడంతో వీరబ్రహ్మేంద్రస్వామికి నవాబు నుండి పిలుపు వచ్చింది. గురువుగారిమీద వచ్చిన ఆ నేరారోపణను తొలగించేందుకు సిద్ధయ్య బయల్దేరాడు. మార్గమధ్యంలో అక్కడక్కడా చెట్ల కింద కూర్చున్న సిద్ధయ్య, ఎక్కువ సమయం ధ్యానంలో మునిగి వుండేవాడు. యోగముద్రలో ఉన్న సిద్ధయ్య వద్దకు ఎందరో బాటసారులు వచ్చి, తమ సందేహాలను బయటపెట్టేవారు. సిద్ధయ్య వారి సందేహాలను తెరచి, సలహా ఇస్తూండేవాడు.
సిద్ధయ్య దగ్గరకు ఎక్కువగా మహమ్మదీయ భక్తులు వస్తూండేవారు. వారికి తన బోధలతో హితోపదేశం చేస్తూ, వారి మనసులను మార్చి, తనవలె నుదుట బొట్టు, కాషాయములు రుద్రాక్షలు ధరింపచేస్తూండేవాడు. సిద్ధయ్య జ్ఞానానికి, బోధనలకు ముగ్దులై, రెండు రోజులలోనే అనేకమంది మహ్మదీయులు హిందువులుగా మారిపోయారు.సిద్ధయ్య చేస్తున్న బోధనల గురించి, ముస్లింలు హిందువులుగా మారిపోవటం గురించి తెలుసుకున్న నవాబు సిద్దయ్యను తన సముఖమునకు పిలిపించాడు. సిద్ధయ్య నవాబు దగ్గరకు వచ్చి నిర్భయంగా నిలబడ్డాడు. పైగా కాస్తయినా వినయం, విధేయతా ప్రదర్శించలేదు. అతని వైఖరి చూసి నవాబుకు కోపం వచ్చింది. సిద్ధయ్యకు ఉరిశిక్ష వేయాలన్నంత ఆగ్రహం కలిగినా, దాన్ని అణుచుకుని ముందుగా అతని ఉద్దేశ్యం తెలుసుకున్న తర్వాతే తానేం చేయాలో నిర్ణయించుకోవాలని భావించాడు. “నువ్వు మహమ్మదీయుడవై వుండి, హిందూ మతానికి చెందిన వ్యక్తిని ఎందుకు ఆరాధిస్తున్నావు? ఇది మహమ్మదీయ మతాన్ని విమర్శించటమే అవుతుంది. ఇది అల్లా పైన నీ అపనమ్మకాన్ని సూచిస్తోంది. ఇది మన మతాన్ని దూషించడమే! కాబట్టి నిన్ను కఠినంగా శిక్షించదలచుకున్నాను. దీనికి నీ జవాబు విన్న తరువాత ఏం చేయాలో ఆలోచిస్తాను” అన్నాడు నవాబు.
నవాబు అంత తీవ్రంగా మాట్లాడినా సిద్ధయ్య అణువంత కూడా చలించలేదు. నవాబును చూసి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. దానితో అసలే కోపంగా వున్నా నవాబుకు ఆగ్రహం మరింత పెరిగింది. కానీ, అతన్ని శిక్షించేముందు విచారణ చేయాల్సి వున్నందు వల్ల సిద్ధయ్యతో ఇలా మాట్లాడాడు. “నీకు మహత్తులు తెలుసని చెప్పుకుంటున్నావు కదా! సరే, ఇప్పుడు నువ్వేం మహత్తు చూపగలవో ప్రదర్శించు. లేకపోతే నీకు తగిన శిక్ష విధిస్తాను” అని హెచ్చరించాడు.
దానికి ప్రతిగా సిద్ధయ్య “మా గురువుగారి అనుజ్ఞ ప్రకారం నేను ఎలాంటి మహిమలూ చూపకూడదు. కానీ, మా గురువుగారి శక్తి తెలుసుకోవాలని మీరు కుతూహల పడుతున్నారు కాబట్టి, తప్పనిసరి పరిస్థితులలో నేను మీకు ఒక మహిమ చూపించనున్నాను. దానికోసం మీరు ఒక బండరాయిని తెప్పించి నా ఎదురుగా వుంచండి. మా గురువు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగారి శక్తి ఏమిటో మీకు చూపుతాను” అన్నాడు. వెంటనే నవాబు ఆలస్యం చేయకుండా తన భటులను పంపి ఒక పెద్ద కొండరాతిని తెప్పించాడు. “ఈ సభలో నేనేమైనా అతీత శక్తి ప్రదర్శిస్తే మీకు, సభలో వున్నవారికీ, కూడా ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం వుంది. కాబట్టి ఎక్కడన్నా ఖాళీ స్థలంలో బండరాయిని వుంచండి” అన్నాడు. అందుకు ఒప్పుకున్న నవాబు రాతిని ఒక ఖాళీ ప్రదేశానికి తరలించాడు.
“ఇప్పుడు నీ శక్తిని, మీ బ్రహ్మంగారి శక్తిని ప్రదర్శించు” అని ఆదేశించాడు. సిద్ధయ్య మనస్సులో గురుదేవుడైన బ్రహ్మంగారిని స్మరించి, తన కుడి చేతిని ఎత్తి ఆ బండరాయికి నమస్కారం చేశాడు. వెంటనే అక్కడున్న ప్రజలందరూ భయకంపితులయ్యే విధంగా, పెద్ద శబ్దంతో బండరాయి ముక్కలైపోయింది.
ఈ అద్భుత దృశ్యాన్ని నవాబుతో సహా, అక్కడ చేరిన ప్రజలందరూ చూశారు. ఎవ్వరికీ నోట మాట రాలేదు. తర్వాత సిద్ధయ్య శాంతంగా నవాబు వేపు చూసి “అత్యంత శక్తిశాలి అయిన నా గురుదేవులను దోషిగా భావించి శిక్షించదలుచుకున్నారు. ఇప్పుడు చూశారు కదా ! ఆయన ఎంత శక్తివంతులో! ఒకవేళ ఆయనకు మీమీద ఆగ్రహం వస్తే మీరేమవుతారో ఆలోచించుకోండి” అన్నాడు. ఈ సంఘటనతో నవాబు భయపడి, తన తప్పును క్షమించమని అడిగాడు. తనకు కూడా జ్ఞానోపదేశం చేయాలని ప్రార్థించాడు. తాను నవాబుకు జ్ఞానోపదేశం చేయలేనని, అందుకు అర్హుడు తన గురువుగారేనని సిద్ధయ్య ఆయనకు నచ్చచెప్పాడు.
“వెంటనే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిని తీసుకురమ్మని ” నవాబు సిద్దయ్యను కోరాడు. “నేను కానీ, మీరు కానీ పిలిస్తే మా గురువుగారు రాలేరు. అందుకు తగిన సమయం రావాలి. అప్పుడు ఆయన వస్తారు. మీకు కూడా ఉపదేశం చేస్తారు” అని సిద్ధయ్య, నవాబుకు నచ్చచెప్పాడు. ఆ తర్వాత సిద్ధయ్య నవాబు వద్ద సెలవు తీసుకుని, అక్కడి నుంచి బయల్దేరి తిరిగి కందిమల్లయ్యపల్లికి వెళ్ళిపోయాడు.
![]() |
సిద్ధయ్య - వీర బ్రహ్మేంద్రస్వామి |
సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం:
ఒకరోజు సిద్ధయ్య వీర బ్రహ్మేంద్రస్వామితో చర్చను ప్రారంభించాడు. “స్వామీ ఈ సమస్త సృష్టికి కారణభూతుడెవరు? ఆయనను మనం ఎలా కనుగొంటాం?” అని సిద్ధయ్య ప్రశ్నించాడు.
అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి సిద్ధయ్యకు ఇలా వివరించారు.
“ఈ ప్రపంచంలో మన అనుభూతికి, జ్ఞానానికి అందని ఒక అద్భుత శక్తి వుంది. దానినే సర్వేశ్వరుడు అని మనం పిలుస్తాం. దీనిని వేర్వేరు మతాలకు చెందినవారు వేర్వేరుగా గుర్తిస్తారు. కానీ,ఆ శక్తిమంతుడు ఒక్కడే! అతడే భగవంతుడని ఆస్తికులంటారు.అది మన జ్ఞానానికి అతీతమైన సర్వోన్నత శక్తి అని, పుట్టుక, మరణము లేని శక్తి అనీ నాస్తికులంటారు.దానిని మనం అన్వేషణ ద్వారా కనుగొనవచ్చు”
“మన కళ్ళకు కనిపించే ఈ ప్రపంచము మొత్తము పూర్తిగా కల్పితమైనదే! అంటే ఇది అశాశ్వతమైనది. ఇది నశించక తప్పదు. అయితే, మరి మనకి కనబడుతున్న ఈ జీవులు, జీవం లేని వస్తువులు శాశ్వతం కాదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించవచ్చు. ఈ శరీరమే అశాశ్వతం. అలాంటప్పుడు మనకి గోచరమయ్యే ఈ చరాచర వస్తువులన్నీ కూడా నాశనమవుతాయి.
జీవుల జ్ఞానానికి, దృష్టికి అందని ఒకే అంశం, తత్త్వం ఈ సృష్టికి ముందు నుంచీ వుంది. ఇప్పుడు కూడా వుంది. తర్వాత కూడా వుంటుంది. దానినే మూల తత్త్వమనీ, భగవంతుడనీ రకరకాల పేర్లతో పిలుస్తాం. కొలుస్తాం. దాని స్వభావాన్ని గ్రహించటం అనేది దాదాపు అసాధ్యం. అది సాధారణ భావనకు అందనిది.
సమస్త సృష్టికీ కారణభూతమే ఈ అంశం. ఇది పరిపూర్ణమైనది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ ఇందులోంచే ఉద్భవించాయి. తిరిగి ఇందులోనే లయమైపోతాయి.శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు. ఈ ప్రపంచంలో జీవులు అనుభవించే అనుభూతులకు అతీతమైనది అది. తన కర్మకు తాను నిర్వరిస్తూ పోతుంది. తప్ప ఎవ్వరి అనుజ్ఞ కోసం, ప్రార్థనల కోసమూ ఆగదు. దానిని మనం భగవంతుడని పిలుస్తూ, అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తూ వుంటాం.
భగవంతుడికి లేదా ఈ అనంతత్వానికి ఒక రూపం లేదు. గుణం లేదు. చావు లేదు. పుట్టుక లేదు.అతడు ఆది లేనివాడు.అనంతమైన వాడు. అన్నింటిలోనూ వుంటాడు. అన్నీ తానై వుంటాడు. కానీ ఇందులో ఏ ఒక్కటీ భగవంతుని గురించి లేదా ఈ ఏకత్వం గురించి చెప్పలేదు. కేవలం మొక్కుబడిగా చేసే పూజలు, చదివే మంత్రాలతో ఎవరూ భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేదు. అలాగే స్వార్థం కోసం చేసే యజ్ఞాలతోనూ మనం భగవంతుని చూడలేం. నిర్మలమైన మనస్సుతో చేసే పనుల వల్ల మాత్రమే, ఎలాంటి యజ్ఞాలు చేయకపోయినా మంత్రాలు చదవకపోయినా భక్తులు సర్వేశ్వరుడిని చూడగలరు.
భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు దైవం తెలీదు. ఈ చర్మ చక్షువులతో భగవంతుని ఎవ్వరూ దర్శించలేరు, గుర్తించలేరు. ఎంతమంది భక్తులున్నప్పటికీ అతి కొద్దిమంది మాత్రమే భగవంతుని చేరుకోగలరు. ఇక జీవుని గురించి వివరిస్తాను. ఈ శరీరంలో 20 కోట్లకు పైన రోమ రంధ్రములున్నాయి. 70 ఎముకలు, మాంసముతో నిర్మితమయినదే ఈ స్థూల దేహము. ఇది సుఖకరమైన అనుభవాలను అందిస్తున్నట్టు భ్రాంతి కలిగించే దుఃఖస్వరూపం. సామాన్య మానవులే కాదు, యోగులు, ఋషులు కూడా వాంఛల ద్వారా మాత్రమే జీవించే ఈ శరీరం పట్ల, సుఖముల పట్ల, కోర్కెల పట్ల అనుబంధము పెంచుకుని ఎన్నో కష్టాలు పొందారు.
ఆత్మవేరు, శరీరం గుర్తించే నేను వేరు. అనేక కోరికల ఫలితంగా రూపుదిద్దుకునేదే నేను. ఆత్మకు ఈ వాంఛలు వర్తించవు.కేవలం నిమిత్త మాత్రముగా ప్రవర్తిస్తూ, జీవుని నడిపిస్తుంటుంది. దానికి ఇరువది అయిదు తత్త్వాలు, దశ నాడులు, సప్త ధాతువులచే నిర్మితమైన ఈ శరీరంలో ఏడు పుష్పములున్నాయి.
![]() |
7 Chakras |
- వీనిలో మొట్టమొదటిది మూలాధారం. గుద స్థానము నందు వుండే మూలధార చక్రమునకు విఘ్నేశ్వరుడు అధిదేవత.
- రెండవది స్వాథిష్టాన చక్రము. ఆధార చక్రమునకు రెండు అంగుళములపై నాలుగు రేకులు కలిగి,మూడు కోణములతో తెల్లని రంగుతో, ప్రకాశవంతంగా, నిర్మలంగా వుంటుంది. ఇది జల తత్త్వాన్ని కలిగి వుంటుంది. ఈ చక్రమునకు బ్రహ్మదేవుడు అధిదేవత.
- మూడవది మణిపూరకము. స్వాధిష్ఠాన చక్రమునకు పైన ఒక మణివలె ప్రకాశిస్తుంటుంది. నీలవర్ణము కలిగింది. మొత్తం పది రేకులతో వుంటుంది. విష్ణువు ఈ చక్రానికి అధిష్టాన దేవత.
- అనాహత చక్రము హృదయ స్థానములో పన్నెండు రేకులతో వుంటుంది. స్వర్ణ కాంతులను వెదజల్లుతూంటుంది .ఇది వాయు స్వభావం కలిగి వుంటుందని యోగుల భావన. దీనికి రుద్రుడు అధిష్టాన దేవత.
- విశుద్ధ అనేది ఐదవ చక్రము. అనాహిత చక్రమునకు పైన, కంఠములో వుంటుంది. పదహారు దళములుంటాయి.
- ఆజ్ఞా చక్రము ఆరవది. విశుద్ధ చక్రము మొదలు 12 అంగుళములపైన భ్రూ మధ్య స్థానంలో (త్రికూట స్థానము) ఉంటుంది. రెండు రేకులు కలిగి వుంటుంది. ఎరుపు, పసుపు రంగులతో అపారమైన కాంతిని వెదజల్లుతుంటుంది. దీనికి ఈశ్వరుడు అధిష్టాన దేవత.
- సహస్రాకారము అనునది ఆజ్ఞా చక్రానికి పైన కపాలంలో, బ్రహ్మరంథ్రము వద్ద వుంటుంది. ఎనిమిది దళాలుంటాయి. వేయి రేకులు కలిగి వుంటుంది.
ప్రాణ వాయువునకు కుడి ఎడమ వేపుల ఇడ పింగళులు అనే నాడులు వున్నాయి. ఇడ పింగళులు సహస్రారము మొదలు ఆగ్నేయ చక్రం వరకు వ్యాపించి వుంటాయి. వీటిమధ్య సుషుమ్ననాడి వుంటుంది. ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి వుంటుంది. ఈ నాడుల యందు ప్రవహించే జీవ శక్తి జీవుని చలనంతో వుంచుతుంది”